అమరావతి : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మోసపూరిత మాటలతో ప్రజలను మోసం చేస్తున్నారని వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని ( Perni Nani ) ఆరోపించారు. ఆదివారం కృష్ణ జిల్లాలో ఆయన మీడియాతో మాట్లాడారు. గడిచిన రెండు సంవత్సరాల్లో 3.50 లక్షల కోట్ల అప్పులు( Debt ) చేశారని దుయ్యబట్టారు. అప్పులు, నేరాలు, నిరుద్యోగంలో ఏపీ దేశంలోనే ముందంజలో ఉందని విమర్శించారు.
వైసీపీ హయాంలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి ఉద్యోగులను, సంస్థను ఆదుకోగా అందుకు భిన్నంగా చంద్రబాబు ఆర్టీసీనీ అమ్మేయడానికి ప్రయత్నిస్తూ ఆ నెపం మహిళలపై వేసేందుకు కుట్ర పన్నుతున్నాడని విమర్శించారు. ఆర్టీసీలో ఉన్న 10 వేల బస్సులను పీఎంఈబస్ స్కీమ్ కింద ఎలక్ట్రికల్ బస్సులుగా మార్చేస్తామనడం సరైనది కాదని పేర్కొన్నారు.
రాష్ట్రంలోని సంపద అంతా చంద్రబాబు, లోకేష్, పవన్, ఎమ్మెల్యేలకే వెళుతుందని ఆరోపించారు. చంద్రబాబు ఎప్పుడు అధికారంలో ఉన్నా ప్రజల ఆస్తులకు ప్రమాదం పొంచి ఉందని అన్నారు. 2004లో వైఎస్సార్ సీఎం అయ్యుండకపోతే ఆర్టీసీని అమ్మేసేవారని తెలిపారు.