అమరావతి : ఏపీ రాజధాని అమరావతిలో ఆర్-5 జోన్ ఇళ్ల నిర్మాణంపై గురువారం ఏపీ హైకోర్టు స్టే (AP High Court Stay ) ఇచ్చింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విషయంమై జగన్ ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్లాలని నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వ హయాంలో రాజధాని అమరావతి నిర్మాణానికి రైతుల వద్ద నుంచి భూములు తీసుకుంది. ఈ సమయంలో రైతులకు మేలు చేసేందుకు అప్పటి ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకుంది.
జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మూడు రాజధానుల పేరిట తీసుకున్ననిర్ణయం పై కొందరు కోర్టుకు వెళ్లడంతో సుప్రీం కోర్టు (Supreme Court ) లో వాదనలు నడుస్తున్నాయి. ఇదిలా ఉండగా నాటి ప్రభుత్వం రైతుల కోసం తీసుకున్న నిర్ణయాలను కాదని జగన్ ప్రభుత్వం ఆర్-5 జోన్ల ( R-5 Zone ) లో ఇళ్ల నిర్మాణానికి పూనుకుంది . ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా అమరావతి కోసం భూములిచ్చిన రైతులతో పాటు రాయపూడి దళిత బహుజన సంక్షేమ ఐక్య కార్యచరణ సమితి ప్రతినిధులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రైతులకు చెందిన భూములను రైతులకు కాకుండా ఇతరులకు ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.
రైతుల పిటిషన్పై గురువారం హైకోర్టులో విచారణ కొనసాగగా ఆర్-5 జోన్ ఇళ్ల నిర్మాణంపై స్టే విధిస్తూ హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఇళ్ల నిర్మాణం వెంటనే ఆపాలని , తుది తీర్పు తర్వాతే ఇళ్ల నిర్మాణం జరగాలనేది కోర్టు అభిప్రాయమని వెల్లడించింది . డ్రాప్టింగ్లో లోపం ఉందన్న అదనపు అడ్వకేట్ జనరల్ వాదన కరెక్టు కాదని, ఆర్-5 జోన్లో ఇళ్ల పంపిణీ అనేది పూర్తిస్థాయి చర్చ విచారణ జరగాల్సిన అంశమని స్పష్టం చేసింది.
ఈ దశలో ఇళ్ల నిర్మాణం పూర్తయితే సరిదిద్దలేని నష్టంగా మారుతుందని పేర్కొంది. రాజధాని అభివృద్ధి, భూములిచ్చిన రైతుల ప్రయోజనాలకు తీర్పు ముడిపడి ఉందని, విశాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని స్టే విధించామని వెల్లడించింది . కాగా హైకోర్టు స్టేను సవాలు చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లాలని నిర్ణయం తీసుకుంది .