అమరావతి: న్యాయమైన తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ ఆందోళన చేస్తున్న ఆశా వర్కర్ల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం నడుం బిగించింది. వారితో ప్రభుత్వం సంప్రదింపులకు దిగింది. వైద్యారోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, ఆ శాఖ కమిషనర్ కే భాస్కర్, ముఖ్య కార్యదర్శి ఎం రవిచంద్ర.. ఆశా వర్కర్ల సంఘం ప్రతినిధులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఎన్సీడీసీ సర్వేను ఆశా వర్కర్లతో చేయించడం వల్ల పని భారం పెరిగిందని తక్షణమే నిలిపివేయాలని ఆశా వర్కర్ల సంఘం ప్రతినిధులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
తమకు ప్రస్తుతం ఇస్తున్న గౌరవ వేతనాన్ని రూ.10 వేల నుంచి రూ.15 వేలకు పెంపుదల చేయాలని, ఉద్యోగ విరమణ ప్రయోజనాలు తదితర అంశాలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని వారు కోరారు. వీటిపై అధ్యయనం చేసి నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం స్పష్టం చేసింది. రంపచోడవరంలో ఇంజెక్షన్ డోస్ కారణంగా గర్భిణి ఆశా వర్కర్ మృతి చెందిన ఘటనలో బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఆశా వర్కర్లకు కొత్త ఫోన్ల పంపిణీపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని చెప్పింది. రాష్ట్రంలో ప్రతి అంగన్వాడీ కార్మికులకు స్మార్ట్ ఫోన్ ఉండేలా రూ.56 వేల ఫోన్లను కొనుగోలు చేస్తున్నామని మంత్రి తానేటి వనిత ఇప్పటికే వెల్లడించారు.
ఆశా వర్కర్ల సంఘం ప్రతినిధులతో సంప్రదింపులు ఇవాళే మొదలయ్యాయని, వారు తమ డిమాండ్లను, విజ్ఞప్తులను మాకు విన్నవించారని మంత్రి ఆళ్ల నాని తెలిపారు. వీటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సాధ్యమైనంత త్వరగా పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సమస్యను సాగదీయకుండా ఆందోళనను విరమించుకుని విధులకు హాజరుకావాలని వారికి మంత్రి ఆళ్ల నాని సూచించారు.