AP News | ఏపీలో అమలవుతున్న పలు పథకాల పేర్లను చంద్రబాబు సర్కార్ మార్చేసింది. విద్యావ్యవస్థలో పలు పథకాలకు గత వైసీపీ ప్రభుత్వం పెట్టిన పేర్లను తొలగించింది. ఈ విషయాన్ని ఏపీ ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేశ్ ట్విట్టర్ (ఎక్స్) ద్వారా వెల్లడించారు.
ఐదేళ్ల పాటు గత ప్రభుత్వం భ్రష్టు పట్టించిన విద్యావ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేయాలని చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం నిర్ణయించిందని నారా లోకేశ్ తెలిపారు. రాష్ట్రంలోని విద్యాలయాలను రాజకీయాలకు అతీతంగా సరస్వతీ నిలయాలుగా తీర్చిదిద్దాలన్నదే తమ సంకల్పమని పేర్కొన్నారు. ఇందులో భాగంగానే తొలుత గత ప్రభుత్వం నాటి ముఖ్యమంత్రి పేరుతో ఏర్పాటు చేసిన పథకాల పేర్లకు స్వస్తి చెబుతున్నామని స్పష్టం చేశారు. విద్యారంగంలో విశేష సేవలందించిన భరత మాత ముద్దు బిడ్డల పేర్లను ఆయా పథకాలకు నామకరణం చేసి సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించామని చెప్పారు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం వర్ధంతిని పురస్కరించుకుని శనివారం నాడు నూతన పథకాల పేర్లను ప్రకటించారు.
పాత పేరు కొత్త పేరు
జగనన్న అమ్మ ఒడి – తల్లికి వందనం
జగనన్న విద్యా కానుక – సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర
జగనన్న గోరుముద్ద – డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం
మన బడి నాడు నేడు – మన బడి మన భవిష్యత్తు
స్వేచ్ఛ – బాలికా రక్ష
జగనన్న ఆణిముత్యాలు – అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కారం