Srisailam | రోజురోజుకు పెరుగుతున్న భక్తుల రద్దీకి అనుగుణంగా, శ్రీశైల మహా క్షేత్రాన్ని సందర్శించే భక్తులకు సౌకర్యాలు కల్పించడానికి అవసరమైన చర్యలన్నీ చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్ కరికాల్ వళవన్ సూచించారు. శుక్రవారం ఆయన శ్రీశైల మహా క్షేత్ర పరిధిలోని భ్రమరాంబికా అతిథి గ్రుహంలో క్షేత్ర నిర్మాణంపై మాస్టర్ ప్లాన్ ను సమీక్షించారు. పెరుగుతున్న భక్తుల రద్దీకి అనుగుణంగా ఆయా ఏర్పాట్లపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.
దేవస్థానం ముఖద్వారం నుంచి శ్రీశైలం వరకూ రహదారి విస్తరణకు అవసరమైన స్థల సేకరణపైనా కరికాల్ వళవన్ చర్చించారు. పర్యావరణ పరిరక్షణకు, క్షేత్ర సుందరీకరణతో పచ్చదనం మరింత పెంచాలని చెప్పారు. శ్రీశైల క్షేత్ర పరిధిలో విరివిగా మొక్కలు నాటేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు.
ఈ సమావేశానికి ముందు కరికాల్ వళవన్.. దేవస్థానం నిర్వహిస్తున్న గో సంరక్షణశాలను పరిశీలించారు. గో సంరక్షణకు దేవస్థానం తీసుకుంటున్న చర్యలను ఈవో డీ పెద్దిరాజు కరికాల్ వళవన్ కు వివరించారు. అటుపై గో సంరక్షణశాలలో విభూతి తయారీని పరిశీలించారు. అటుపై గో సంరక్షణ శాలలో కదంబం మొక్క నాటారు.
ఈ సమీక్షా సమావేశంలో దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు వీ రామక్రుష్ణ, మురళీధర్ రెడ్డి, ఇన్ చార్జి డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు చంద్రశేఖర శాస్త్రి, పీవీ సుబ్బారెడ్డి, ఉద్యానవన శాఖ అధికారి లోకేశ్, సహాయ స్థపతి ఐఎన్వీ జవహార్ పాల్గొన్నారు. గో సంరక్షణ పర్యవేక్షకులు బీ శ్రీనివాస్ తదితరులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.