AP Elections | ఏపీ సీఎం జగన్పై మాజీ సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. కుప్పం నియోజకవర్గంలో సోమవారం మహిళలతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరలో జరుగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కుప్పం ప్రజలు తనకు లక్ష ఓట్ల మెజారిటీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ప్రజలను తానెప్పుడూ మెజారిటీ ఇవ్వాలని అగడలేదని.. ప్రజలే భారీ మెజారిటీ ఇవ్వాలని నిర్ణయించుకున్నారన్నారు.
కుప్పంలో వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థికి డిపాజిట్ కూడా రాదని జోష్యం చెప్పారు. ఏపీలో భారీ మెజారిటీ వచ్చే నియోజకవర్గం కుప్పమేనని.. ఎన్నికల్లో టీడీపీని గెలిపించిన నియోజకవర్గం కుప్పంమన్నారు. సైకిల్కు తప్ప వేరే పార్టీకి ఓటేయని నియోజకవర్గం బంగారు కుప్పం అని వ్యాఖ్యానించారు. గతంలో 70వేల మెజారిటీ వచ్చిందని.. ఈ సారి లక్ష్యం లక్ష ఓట్ల మెజారిటీ అని పేర్కొన్నారు.
ఇప్పటికీ నియోజకవర్గ ప్రజలు ఏడుసార్లు గెలిపించారని.. ఎంతో రుణపడి ఉన్నానన్నారు. గత 35ఏళ్లలో ఏం చేశానో.. రాబోయే ఐదేళ్లలోనూ అంత చేయి చూపిస్తానన్నారు. మొన్న చాలా మంది కుప్పిగంతులు వేశారని.. చంద్రబాబును ఓడిస్తామన్నారని గుర్తు చేశారు. వై నాట్ కుప్పం.. వైనాట్ 175 అన్నారని.. కుప్పంలో తనను ఓడించడం వైఎస్సార్ కాంగ్రెస్తో సాధ్యమవుతుందా? అని ప్రశ్నించారు.
తాను వై నాట్ పులివెందుల ? నీకెందుకు ఓటు వేయాలని జగన్ ? బాబాయిపై గొడ్డలి వేటు వేసినందుకా ? రాష్ట్రాన్ని దోచుకున్నందుకా ? రాష్ట్రాన్ని రావణకాష్ఠంలా మార్చినందుకా? అంటూ ప్రశ్నించారు. కుప్పం నుంచి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడున్నానన్న బాబు.. ప్రజాగళం ఉధృతంగా మారి.. తీవ్ర వాయుగుండంగా మారి అడ్డొచ్చిన వారిని బంగాళాఖాతంలో కలిపేస్తుందన్నారు. ఏ చెట్టును అడిగినా.. ఏ పుట్టని అడిగినా సైకిల్.. మిత్రపక్షాల మాటే వినపడాలని.. ఫ్యాన్ను చిత్తుచిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు.