Urea Shortage | ఏపీలో రైతుల యూరియా కష్టాలు వర్ణనాతీతమని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. ఏ రైతుని కదిలించినా ఎరువుల కోసం కన్నీటివ్యథ.. తెల్లవారు జామునుంచే ఎరువుల కేంద్రాల దగ్గర కిలోమీటర్ క్యూలు.. కట్ట యూరియా కోసం రోజుల తరబడి ఎదురుచూపులు.. ఇదేనా కూటమి ప్రభుత్వానికి రైతాంగం మీదున్న చిత్తశుద్ధి అని ప్రశ్నించారు.
ఎరువుల కోసం రైతులను అరిగోస పెట్టడమా రైతు పక్షపాతి అంటే అని వైఎస్ షర్మిల ప్రశ్నించారు. బీజేపీకి మద్దతు ఇచ్చిన రాష్ట్రంలో రైతు సేవా, మార్క్ ఫెడ్ , సొసైటీ కేంద్రాల దగ్గర యూరియా నో స్టాక్ బోర్డ్ లు పెట్టడానికి సిగ్గుండాలని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వానిది సాగుకు పెద్దపీట కాదు…రైతు మెడమీద కత్తిపీట పెట్టారని ధ్వజమెత్తారు. రాష్ట్ర కోటా మేరకు యూరియా వస్తే మరి ఆ ఎరువులు ఏమైనట్లు అని ప్రశ్నించారు. 6.34 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా రాష్ట్రానికి చేరుకుంటే రైతులకు ఎరువు కరువు ఎందుకు అని నిలదీశారు. రైతులకు చేరాల్సిన యూరియా ఏ దారి మళ్లింది ? ఎవరి గోడౌన్లకు అక్రమంగా యూరియా తరులుతోంది ? అక్రమ రవాణాపై వ్యవసాయ శాఖ, విజిలెన్స్ నిద్ర పోతుందా ? అని ప్రశ్నించారు.
266 రూపాయలు అమ్మాల్సిన బస్తా ధర బహిరంగ మార్కెట్ లో 500 రూపాయలకు ఎందుకు అమ్ముతున్నారు అని వైఎస్ షర్మిల ప్రశ్నించారు. ఇది నిజంగా కొరతనా.. లేక అధికార పార్టీ నేతలు సృష్టిస్తున్న కృత్తిమ కొరతనా ? అని నిలదీశారు. దీనికి సీఎం చంద్రబాబు సమాధానం చెప్పాలని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేశారు. వెంటనే యూరియా బ్లాక్ మార్కెట్ దందా అరికట్టాలని.. విజిలెన్స్ తనిఖీలు ముమ్మరం చేయాలని.. ప్రైవేట్ వ్యాపారులపై తక్షణ తనిఖీలు నిర్వహించాలని కోరారు. యూరియాను బ్లాక్ చేసిన వాళ్ల పై EC యాక్ట్ ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రైతులకు ఈ ఖరీఫ్ సీజన్లో అదనంగా అవసరం పడిన 1.5 లక్షల మెట్రిక్ టన్నుల మేర యూరియాను వెంటనే సొసైటీల ద్వారా సరఫరా చేయాలన్నారు. రాష్ట్ర రైతాంగాన్ని తక్షణం ఆదుకోవాలన్నారు.