YS Sharmila | ఆస్తుల వివాదంపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఏపీ పీసీసీ అధ్యక్షుడు వైఎస్ షర్మిల మండిపడ్డారు. మీరు చదివింది జగన్ మోహన్ రెడ్డి స్క్రిప్ట్ కాదని ప్రమాణం చేయగలవా అని విజయసాయిరెడ్డికి సవాలు విసిరారు. ఆస్తుల గురించి నలుగురు చిన్న బిడ్డలకు సమాన వాటా ఉంటుందన్న YSR మ్యాండేట్ .. అబద్ధం అని మీ బిడ్డల మీద ప్రమాణం చేయగలరా ? అని నిలదీశారు. మీరు కూడా జగన్ మోహన్ రెడ్డి మోచేతి నీళ్ళు తాగిన వాళ్ళే అని ఎద్దేవా చేవారు. రాజకీయంగా,ఆర్థికంగా జగన్ వల్ల బలపడిన వాళ్ళే.. మీరు ఇలా కాకపోతే ఎలా మాట్లాడుతారులే అని విమర్శించారు.
YSR మరణానికి కాంగ్రెస్ ముమ్మాటికీ కారణం కాదని షర్మిల స్పష్టం చేశారు. రెండు సార్లు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చింది YSR అని తెలిపారు . బంగారు బాతును ఎవరు చంపుకోరని.. సొంత కళ్లను ఎవరు పొడుచుకోరని అన్నారు. YSR మరణానికి చంద్రబాబు కారణం అయితే మీరు అధికారంలో ఉండి ఐదేళ్లు గాడిదలు కాశారా అని ప్రశ్నించారు. ప్రత్యేక విచారణ ఎందుకు జరిపించలేదు ? దర్యాప్తు చేసి నిజానిజాలు ఎందుకు బయట పెట్టలేదు ? దోషులను ఎందుకు శిక్షించలేదు ? అని నిలదీశారు. అనుమానం ఉండి, 5 ఏళ్లు అధికారంలో ఉండి, ఎందుకు ఒక్క ఎంక్వైరీ కూడా వేయలేదు ? ఇది మీ చేతకానితనానికి నిదర్శనం కాదా అని మండిపడ్డారు.
YSR మరణం తర్వాత చార్జిషీట్లో ఆయన పేరు చేర్పించింది మీ నాయకుడు జగన్ మోహన్ రెడ్డి కాదా ?అని షర్మిల ప్రశ్నించారు. కేసుల నుంచి బయట పడటానికి పొన్నవోలుతో కలిసి ఈ కుట్ర చేయలేదా ? చేయకపోతే జగన్ గారు సీఎం అయిన వెంటనే, మొదటగా అడ్వకేట్ జనరల్ పదవి ఎందుకు ఇచ్చారు ?అని ప్రశ్నించారు. ఇప్పుడు మళ్ళీ తన స్వప్రయోజనం కోసం తల్లిని కోర్టుకి ఈడ్చిన విషపు నాగు జగన్ కాదా అని అడిగారు.
చంద్రబాబు నాకు ఎటువంటి వ్యక్తిగత సంబంధాలు లేవని షర్మిల స్పష్టం చేశారు. YSR తన బిడ్డ పెళ్లికి చంద్రబాబును పిలిచారని.. అలాగే నేను కూడా పిలిచానని ప్రశ్నించారు. ప్రతిపక్ష నేతను పెళ్లికి ఆహ్వానిస్తే.. నా చీర గురించి కూడా విపరీత అర్థాలు తీసే మీలాంటి వాళ్లకు సభ్యతా సంస్కారం ఉందని ఎలా అనుకోవాలని అన్నారు.
జగన్కు ఇంకా చంద్రబాబు పిచ్చి వీడలేదా ? ఇప్పటికీ అద్దంలో చూసుకున్నా.. చంద్రబాబే కనిపిస్తున్నట్లుంది అని షర్మిల ఎద్దేవా చేశారు.. చంద్రబాబు కళ్ళల్లో ఆనందం చూడటానికో.. ఆయన బ్రాండింగ్ ను ఫాలో అవ్వడానికో.. ఆయన్ను ఇంప్రెస్ చేయడానికో.. పని చేయాల్సిన అవసరం YSR బిడ్డకు ఎన్నటికీ రాదని మాట ఇస్తున్నా అని అన్నారు.