YS Sharmila | రాష్ట్రంలో PDS రైస్ విదేశాలకు తరలించడం పెద్ద మాఫియా అని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. ఇదో జాతీయ స్థాయి కుంభకోణమని పేర్కొన్నారు. పేదల పొట్టకొట్టి 48 వేల కోట్ల రూపాయల ప్రజల డబ్బును పందికొక్కుల్లా తినేసిన దోపిడీ అని విమర్శించారు. తిలా పాపం తలా పిడికెడు అన్నట్లు.. రేషన్ బియ్యం స్మగ్లింగ్ వెనుక ప్రజా ప్రతినిధుల ప్రమేయం ఉందని ఆరోపించారు.. కింద నుంచి ఉన్నత స్థాయి వరకు కొంతమంది అవినీతి అధికారుల పాత్ర ఉందని. ఎవరికి దక్కాల్సిన వాట వాళ్లకు చేరుతుండటంతో నిఘా వ్యవస్థ పూర్తిగా కళ్ళుమూసుకుందని అన్నారు.
గడిచిన మూడేళ్లలో రాష్ట్రంలోని పోర్టుల నుంచి 2 కోట్ల టన్నుల రేషన్ బియ్యం అక్రమంగా రవాణా అయ్యిందంటే మన చెక్ పోస్టుల పని తీరు ఏంటో అంచనా వేయొచ్చని షర్మిల విమర్శించారు. ఏ స్థాయిలో అవినీతి జరుగుతుందో అర్థం చేసుకోవచ్చని మండిపడ్డారు. అక్రమ బియ్యాన్ని పట్టేందుకు మీరు బోట్లు వేసుకొని సముద్రంలో హడావిడి చేయడం కాదు.. నిజాలు నిగ్గు తేల్చండి అని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
పేదలకు దక్కాల్సిన రేషన్ బియ్యం అక్రమంగా పోర్టు దాకా ఎలా చేరుతుంది ? మూడేళ్లలో 2 కోట్ల టన్నుల రేషన్ బియ్యాన్ని ఎలా సేకరించారు ? దీని వెనకున్న బియ్యం దొంగలెవరు ? రూ.48 వేల కోట్లు ఎవరెవరు తిన్నారు ? అప్పటి ప్రభుత్వ పెద్దలకు బియ్యం మాఫియాతో సంబంధాలు ఉన్నాయా ? తీగ లాగితే వెనకున్న డొంక ఎక్కడ ? మిల్లర్ల చేతివాటం ఉందా ? రేషన్ డీలర్ల మాయాజాలమా ? అనునిత్యం తనిఖీల సంగతి ఏంటి అని షర్మిల ప్రశ్నించారు. వీటిపై నిజాలు నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
PDS బియ్యం అక్రమ రవాణాపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు కమిటీ వేయాలని.. లేదా కేంద్ర దర్యాప్తు సంస్థ CBIతో విచారణ జరిపించాలని ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ను డిమాండ్ చేశారు. ఆంధ్రపదేశ్ అంటే అన్నపూర్ణమ్మ అని.. ధాన్యాగారానికి భాండాగారం అని అన్నారు. ప్రపంచానికి అన్నం పెట్టే మన రాష్ట్రాన్ని రేషన్ బియ్యం మాఫియాకు అడ్డాగా మార్చారని మండిపడ్డారు. ఆరుగాలం కష్టించి పడించే రైతుకు దక్కేది కన్నీళ్లు అయితే… బియ్యం అక్రమార్కులకు దక్కుతున్నవి కాసులు అని విమర్శించారు. ఇది మన రాష్ట్ర దుస్థితి అని వాపోయారు.