AP CM Jagan | రాబోయే ఎన్నికల్లో అధికారం దక్కించుకోవడమే లక్ష్యంగా ప్రతిపక్షాలు చేస్తున్న అబద్ధపు ప్రచారాలపై ఏపీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మండిపడ్డారు. రాబోయే రోజుల్లో పొత్తులు ఎక్కువగా పెట్టుకుంటారని.. పొత్తుల కోసం కుటుంబాలను సైతం అడ్డగోలుగా చీలుస్తారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిపక్షాల కుయుక్తుల నుంచి అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు. కాకినాడలో నిర్వహించిన వైఎస్సార్ పింఛన్ కానుక పెంపు కార్యక్రమంలో ఏపీ సీఎం జగన్ పాల్గొన్నారు. అనంతరం రంగరాయ మెడికల్ కాలేజి గ్రౌండ్స్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రతిపక్షాలు చేస్తున్న మోసాలను ప్రజలకు వివరించారు.
రాబోయే రోజుల్లో ఇంకా అబద్ధాలు చెబుతారని.. ఇంకా ఎక్కువ మోసాలు చేసే పరిస్థితి వస్తుందని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో ప్రతి ఇంటికీ కేజీ బంగారం ఇస్తామని.. ప్రతి ఇంటికి బెంజ్ కారు ఇస్తామని చెప్పే నాయకులు మన ముందుకొస్తారని అన్నారు. రాబోయే రోజుల్లో కుట్రలు, కుతంత్రాలు ఎక్కువగా జరుగుతాయని పేర్కొన్నారు. కుటుంబాలను అడ్డగోలుగా చీల్చే కార్యక్రమాలు కూడా జరుగుతాయని అన్నారు. రాబోయే రోజుల్లో పొత్తులు ఎక్కువగా పెట్టుకుంటారని.. కుటుంబాలను చీల్చి రాజకీయం చేస్తారని పునరుద్ఘాటించారు. మన ముందుకొచ్చి అబద్ధాలు చెబుతారని.. మోసాలు చేస్తారని చెప్పారు. వాళ్ల నుంచి అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
మీ బిడ్డకు వాళ్ల మాదిరి కుట్రలు చేయడం చేతకాదని.. వాళ్ల మాదిరి అబద్ధాలు ఆడటం చేతకాదని.. వాళ్ల మాదిరి రాజకీయం చేయడం చేతకాదని అన్నారు. మీ బిడ్డకు తెలిసిన రాజకీయం ఒక్కటే.. మంచి చేయడం, పేదవాడికి అండగా నిలబడటం మాత్రమేనని స్పష్టం చేశారు. తాను నమ్ముకున్నది పైన ఉన్న దేవుడికి.. కింద ఉన్న మిమ్మల్ని మాత్రమేనని అన్నారు. మధ్యలో ఎవర్నీ నమ్ముకోలేదని తెలిపారు. మీ బిడ్డకు ఎవరి అండా ఉండకపోవచ్చని.. దత్తపుత్రుడు తోడుగా నిలబడకపోవచ్చని అన్నారు. అయినప్పటికీ తాను నమ్ముకున్నది పొత్తుల్ని.. యత్తుల్ని .. జిత్తుల్ని .. కుయుక్తులను.. కుట్రలను కాదని అన్నారు. మీ బిడ్డ నమ్ముకున్నది పైన దేవుడిని.. కింద ఉన్న మిమ్మల్నే అని పునరుద్ఘాటించారు.