YS Jagan | కాంగ్రెస్ ఎప్పుడూ చెత్త రాజకీయాలు చేస్తోందని ఏపీ సీఎం జగన్ ఆరోపించారు. విభజించి రాష్ట్రాన్ని పాలించాలని అనుకుంటుందని విమర్శించారు. అప్పుడు రాష్ట్రాన్ని అన్యాయంగా విభజించినట్టే.. ఇప్పుడు తన కుటుంబాన్ని కూడా చీల్చి తన చెల్లెలితో.. తన మీదనే రాజకీయాలు చేయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతిలో జరిగిన ఇండియా టుడే ఎడ్యుకేషన్ సమ్మిట్లో ఏపీ సీఎం జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ తీరుపై మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ తన కుటుంబాన్ని చీల్చి రాజకీయాలు చేస్తుందని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను కాంగ్రెస్ నుంచి విడిపోయినప్పుడు.. తన చిన్నాన్నకు మంత్రి పదవి ఇచ్చి.. తనపైనే పోటీకి దించారని జగన్ ఆనాటి పరిస్థితిని గుర్తుచేశారు. ఇప్పుడు మళ్లీ అదే కాంగ్రెస్ తన సోదరికి పార్టీ సారథ్య బాధ్యతలు అప్పగించారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారం అనేది దేవుడు ఇచ్చేదని.. ఆయనే అన్నీ చూసుకుంటాడని వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ చెత్త రాజకీయలు చేస్తోంది.
రాష్ట్రాన్ని విభజించి కాంగ్రెస్ అన్యాయం చేసింది.
నా కుటుంబాన్ని చీల్చి నా చెల్లెలితో, నా మీద రాజకీయాలు చేయిస్తోంది.
-సీఎం @ysjagan#YSJaganForQualityEducation pic.twitter.com/xIPhDAhjd5
— YSR Congress Party (@YSRCParty) January 24, 2024
చంద్రబాబుపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నట్లు వస్తున్న ఆరోపణలపైనా వైఎస్ జగన్ స్పందించారు. చంద్రబాబు విషయంలో తనకు ప్రతీకారం అనేది లేనే లేదని స్పష్టం చేశారు. చంద్రబాబు అవినీతి ఆరోపణల విషయం కోర్టుకు చేరిందని.. ఆ ఆరోపణలు, ఆధారాలను చూసి కోర్టు నిర్ణయం తీసుకుని రిమాండ్కు తరలించిందని తెలిపారు. సీఐడీ కేసులు పెట్టినా సరే.. కోర్టులు అయితే ఆధారాలు చూస్తాయి కదా నిలదీశారు. ఆధారాలను చూసి కన్విన్స్ అయితేనే కోర్టులు నిర్ణయాలు తీసుకుంటాయని వివరించారు. అలాంటప్పుడు అది ప్రతీకారం ఎలా అవుతుందని ప్రశ్నించారు.
ఇక రాష్ట్రంలో రెండోసారి వైసీపీ అధికారంలోకి రావడం ఖాయమని వైఎస్ జగన్ అన్నారు. తమ ప్రభుత్వం వల్ల మేలు జరిగిందని భావిస్తేనే ఓటు వేయాలని ప్రజలను ధైర్యంగా అడుగుతున్నానని స్పష్టం చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీల ఉనికి రాష్ట్రంలో పెద్దగా ఉండదని ఆయన తెలిపారు. వైసీపీకి, టీడీపీ-జనసేన కూటమికి మధ్యే పోటీ ఉంటుందని స్పష్టం చేశారు.