YS Jagan | పదవిపై తనకు వ్యామోహం కానీ.. అధికారం పోతుందన్న భయం కానీ ఎప్పుడూ లేవని ఏపీ సీఎం జగన్ అన్నారు. పేదోడి భవిష్యత్తును మార్చాలన్నదే తన లక్ష్యమని పేర్కొన్నారు. బాపట్ల జిల్లా మేదరమెట్లలో ఆదివారం నిర్వహించిన వైసీపీ సిద్ధం భారీ బహిరంగ సభలో వైఎస్ జగన్ మాట్లాడారు. ప్రతి హిస్టరీ బుక్లో పేరు ఉండాలన్నదే తన కోరిక అని ఈ సందర్భంగా జగన్ బయటపెట్టారు. చనిపోయినా సరే పేదల గుండెల్లో బతికి ఉండాలన్నది తన ఆశ అని పేర్కొన్నారు. అందుకే అధికారం అడుగుతున్నా అని స్పష్టం చేశారు.
ఇతర పార్టీల పొత్తులతో చంద్రబాబు ఎన్నికలకు వస్తున్నారని.. ప్రజలే బలంగా మనం తలపడబోతున్నామని ఏపీ సీఎం జగన్ తెలిపారు. ఇది ధర్మ, అధర్మాల మధ్య జరిగే యుద్ధమని అన్నారు. పొత్తులతో చంద్రబాబు వస్తుంటే.. ప్రజలే బలంగా మనం తలపడబోతున్నామని అన్నారు. రాబోయే కురుక్షేత్రంలో శ్రీకృష్ణుడి పాత్ర ప్రజలదే అని పేర్కొన్నారు. ఈ యుద్ధంలో అర్జునుడి పాత్ర తనదని అన్నారు. కౌరవ సైన్యంపై యుద్ధం చేయబోతున్నామని.. జమ్మి చెట్టు మీద ఇంతకాలం దాచిన ఓటు అనే ఆయుధాన్ని ప్రయోగించాల్సిన సమయం వచ్చిందని జగన్ పిలుపునిచ్చారు.
సిద్ధం అంటేనే ఓ ప్రజా సముద్రం కనిపిస్తోందని చెప్పారు. జగన్ను ఓడించాలని ప్రతిపక్షాలు చూస్తుంటే.. పేదలను గెలిపించాలని తాను చూస్తున్నానని జగన్ అన్నారు. మరో చారిత్రక యుద్ధానికి సిద్ధమా అని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. చంద్రబాబులా తనకు ఎవరితోనూ పొత్తు లేదని.. తన వెంట నడిచే పొలిటికల్ స్టార్స్ లేరని అన్నారు. తనకు ప్రజలే స్టార్ క్యాంపెయినర్లు అని తెలిపారు. వచ్చే ఎన్నికల కోసం ఉత్తరాంధ్ర, రాయలసీమ, ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా సిద్ధమైందని అన్నారు. చంద్రబాబు గుండెల్లో జగన్ రైళ్లు పరిగెత్తించారని.. అందుకే ఇన్ని పొత్తులు పెట్టుకుంటున్నాడని విమర్శించారు. ఏపీలో చంద్రబాబు సైకిల్ చక్రం తిరగడం లేదని.. అందుకే ఢిల్లీకి వెళ్లి పడిగాపులు కాస్తున్నారని ఎద్దేవా చేశారు. దత్తపుత్రుడితో కలిసి వెళ్లి మోకరిల్లుతున్నారని విమర్శించారు. తనపై అరడజను పార్టీలు బాణాలు ఎక్కుపెట్టాయని అన్నారు. ప్రజలు, దేవుడిని తప్ప పొత్తులు, ఎత్తులను నమ్ముకోలేదని చెప్పారు. ఒంటరిగా సింహంలా అందరికీ తోడుగా ఉన్నానని అన్నారు.