అమరావతి : ఆంధ్రప్రదేశ్లో సీఎం జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ‘ ఆడలేక మద్దెలవోడు’ అన్నట్లు ఉందని వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణ రాజు ఆరోపించారు. తమ చేతగాని తనాన్ని దుష్టచతుష్టయంపై వేయడం మూర్ఖత్వమని అన్నారు. నవరత్నాల పేరిట ఇచ్చే స్కీంలన్నీ గత ప్రభుత్వాలు ఇచ్చినవేనని పేర్కొన్నారు. పాతవాటికి కొత్త పేర్లు పెట్టి ప్రజలను మభ్యపెడుతున్నారని ఆరోపించారు. పార్టీ అధికారంలోకి రావడానికి ఇచ్చిన హామీలను మరిచిపోయారని ఆరోపించారు.
ప్రభుత్వ విధానాల వల్ల రాష్ట్రంలో వైసీపీ భూస్థాపితం అయ్యిందని తెలిపారు. అనేక వైఫల్యాలు ఉన్నందున ఏపీలో 175 సీట్లు వైసీపీకి ఎందుకు వస్తాయని ప్రశ్నించారు. ఈరోజు ఎన్నికలు జరిగితే అధికార వైసీపీకి 25 నుంచి 30 సీట్లు మాత్రమే వస్తాయని తెలిపారు. సీఎంగా గెలిచిన తరువాత జగన్ ప్రజల్లోకి వెళ్లడం లేదని, అతడికి ఉన్న పరిస్థితుల కారణంగా బందోబస్తుతో బయటకు వెళ్తున్నారని విమర్శించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆధ్వాన్నంగా ఉందని , ఆర్థిక నిపుణులు ఏపీ ఆర్థిక స్థితిపై చివాట్లు పెడుతున్నారని అన్నారు.