అమరావతి : వైఎస్సార్ కడప జిల్లా ఒంటిమిట్ట కోదండరామ స్వామి ఆలయంలో వైభవంగా కల్యాణోత్సవాన్ని నిర్వహించేందుకు టీటీడీ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. టీటీడీ నిర్వహణలో ఆలయంలో వసంతోత్సవంలో భాగంగా ఏపీ సీఎం జగన్ కల్యాణోత్సవంలో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వం తరుఫున సీఎం స్వామివారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించనున్నారు. ఇవాళ సాయంత్రం ప్రత్యేక విమానంలో సీఎం కడపకు చేరుకోనున్నారు.
అక్కడి నుంచి రాత్రి 7 గంటలకు రోడ్డు మార్గాన ఒంటిమిట్టకు వెళ్లి కోదండరాముడిని దర్శించుకోనున్నారు. రాత్రి 8 నుంచి 10 వరకు కల్యాణాన్ని తిలకించి రాత్రి కడపలోని ఆర్అండ్ బీ అతిథిగృహంలో బస చేయనున్నారు.తిరుమల నుంచి వచ్చిన వేదపండితుల ఆధ్వర్యంలో కల్యాణం జరుగనుంది. కల్యాణోత్సవాన్ని 50వేల మంది వీక్షించేలా ఏర్పాట్లు చేశారు.
సీఎం పర్యటన కారణంగా కడప, ఒంటిమిట్ట ప్రాంతాల్లో పోలీసులను భారీగా మోహరించారు. పట్టణంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ప్రజలకు అసౌకర్యం కలగకుండా ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ట్రాఫిక్ మళ్లిస్తున్నారు. కడప, ఒంటిమిట్ట, రేణిగుంట రహదారిపై ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
,