YS Jagan | చంద్రబాబు కేవలం వాగ్ధానాలే ఇస్తారని.. వాటిని అమలు మాత్రం చేయరని ఏపీ సీఎం వైఎస్ జగన్ విరుచుకుపడ్డారు. తాను మాత్రం ఐదేండ్లలో ఏ కారణం కూడా చూపించి ఇచ్చిన హామీలను ఎగ్గొట్టలేదని స్పష్టం చేశారు. 2014 ఎన్నికల సమయంలో చంద్రబాబులా రైతు రుణమాఫీ చేస్తానని ఒక్క మాట అబద్ధం చెప్పి ఉంటే.. అధికారంలోకి వచ్చేవాడిని అని తెలిపారు. ఆ ఒక్క అబద్ధం ఆడలేదు కాబట్టే ఐదేండ్లు ప్రతిపక్షంలో కూర్చున్నానని చెప్పారు. ఏపీ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం సమయంలో జగన్.. టీడీపీ అధినేత చంద్రబాబుపై విరుచుకుపడ్డారు.
మేం అభివృద్ధి చేయకపోతే.. మీకెందుకు అంత భయం
చంద్రబాబు కంటే తక్కువ అప్పులతో.. ఎక్కువ సంక్షేమ పథకాలను అందజేశామని జగన్ తెలిపారు. ఐదేండ్లలో ఏ కారణం చూపించి ఇచ్చిన వాగ్ధానాలను ఎగ్గొట్టలేదని ఏపీ సీఎం జగన్ తెలిపారు. మేనిఫెస్టోలో చెప్పిన వాటిలో 99 శాతం హామీలను నిబద్ధతతో అమలు చేశామని చెప్పారు. ప్రతి రూపాయిని బాధ్యతతో ఖర్చు పెడుతూ.. పేదలకు అందజేస్తూ.. హ్యూమన్ క్యాపిటల్పై పెట్టుబడి పెట్టామని అన్నారు. ఏ ప్రభుత్వమైనా సరే ఐదేండ్ల పాలనలో ప్రజలకు మంచి చేయలేదని.. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయలేదని ప్రతిపక్షం నమ్మితే.. అలాంటి పరిస్థితుల్లో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షాలు ఏకం కావాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. జాతీయ పార్టీలతో కూడా ప్రత్యక్షంగా ఒకరితో.. పరోక్షంగా మరో పార్టీతో అవగాహన కుదుర్చుకున్నారని టీడీపీ పొత్తులపై ఎగతాళి చేశారు. అభివృద్ధి చేసిన అధికార పార్టీకి తిరుగులేదని స్పష్టం చేశారు. ప్రజల్లో లేరు కాబట్టే ప్రతిపక్షం.. కుట్రలు, పొత్తులను ఆశ్రయించిందని అన్నారు. పొత్తులతో పాటు అబద్ధాలు, మోసాలను ఆశ్రయించడం దారుణమని అన్నారు. అందుకే చంద్రబాబు కొత్త కొత్త వాగ్ధానాలతో గారడీలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు.
చంద్రబాబు పేరు చెబితే గుర్తొచ్చే పథకం ఒక్కటీ లేదు
‘చంద్రబాబు వయసు 70 ఏండ్లు.. రాజకీయాల్లోకి వచ్చి 45 ఏండ్లు.. తొలిసారి ముఖ్యమంత్రి అయ్యి 30 ఏండ్లు అవుతుంది.. ఇన్నేండ్ల తర్వాత.. మూడుసార్లు సీఎం, 14 ఏండ్లు సీఎంగా పనిచేసిన తర్వాత కూడా.. ఇది చేశా కాబట్టి నాకు ఓటు వేయండి అని ఆయన నోటి నుంచి రావట్లేదు. ఇప్పుడు కూడా నాకు మరో ఛాన్స్ ఇస్తే.. ఇది చేస్తా.. అది చేస్తానని అంటున్నాడు ‘ అని ఎద్దేవా చేశారు. ఇన్నేండ్ల తర్వాత కూడా చంద్రబాబు పేరు చెబితే గుర్తుకొచ్చే ఒక్క పథకం లేదని అన్నారు. ఆయన పేరు చెబితే ఇవాల్టికి కూడా గుర్తొచ్చేది వెన్నుపోటు అని విమర్శించారు. చంద్రబాబు మ్యానిఫెస్టో వచ్చిందంటే చాలు.. ఒక్కో పేజిలో ఒక్క సామాజికవర్గానికి హామీలు పెడతారని అన్నారు. కానీ ఎన్నికల తర్వాత ఆ మేనిఫెస్టో చెత్తబుట్టలోకి వెళ్తుంది.. కనీసం నెట్లో కూడా ఉండదని విమర్శించారు.
ఏ మేనిఫెస్టో చూసినా మోసాలే
ఇప్పుడు కూడా మోసపూరిత మ్యానిఫెస్టోతో చంద్రబాబు మళ్లీ వస్తున్నాడని జగన్ తెలిపారు. ఇటీవల నాలుగు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల సమయంలో ప్రజలను ఆకర్షించిన ఆరు స్కీమ్లను తెచ్చి కిచిడీ చేసి మేనిఫెస్టో రెడీ చేశారని ఎద్దేవా చేశారు. ఇవన్నీ నిజంగా అమలు చేయలుగుతామా అన్న ఆలోచన లేకుండా.. కేవలం మోసం చేసి ప్రజలను నమ్మించాలనే ఆలోచనతో వస్తున్నారని విమర్శించారు. వాళ్లకు అధికారం ప్రజలకు మంచి చేయడానికి కాదని అన్నారు. ప్రజలను మోసం చేయడానికి, దోచుకోవడానికి మాత్రమే వాళ్లకు అధికారం కావాలన్నారు. చంద్రబాబు చరిత్ర, ఏ మేనిఫెస్టో చూసిన ఇవే మోసాలు కనిపిస్తాయని అన్నారు. 1994 నుంచి2014 వరకు ఇచ్చిన హామీలు అన్నింటిలోనూ ఇదే కనిపిస్తుందని గుర్తు చేశారు. 2014 ఎన్నికల సమయంలో 650 హామీలతో మేనిఫెస్టో విడుదల చేస్తే అందులో కనీసం పది కూడా అమలు చేయలేదని విమర్శించారు. ఇలాంటి వ్యక్తిని నమ్మడం కరెక్టేనా అని ఆలోచించాలని ప్రజలకు సూచించారు. ప్రజలు ఎలాగూ అధికారం ఇవ్వరనే నమ్మకంతోనే బాబు మార్క్ గ్యాంబ్లింగ్ మొదలు పెట్టారన్నారు.
ఆ ఒక్క అబద్ధం చెప్పలేదు కాబట్టే..
2014లో చంద్రబాబు కూటమికి 46 శాతం వస్తే.. వైసీపీకి 46 శాతం వచ్చాయని జగన్ గుర్తు చేశారు. వాళ్లందరూ కలిసి దాడి చేస్తే.. తాము మాత్రం ఒక్కరమే పోటీ చేశామని.. అయినా ఒక్క శాతం ఓట్ల తేడా మాత్రమే వచ్చిందని అన్నారు. అప్పటి ఎన్నికల సమయంలో రైతులకు రుణమాఫీ ఇస్తామని హామీ ఇద్దామని చాలామంది శ్రేయోభిలాషులు సలహా ఇచ్చారు. అయితే చేయలేనిది చెప్పకూడదు.. మాట ఇస్తే తప్పకూడదని నేను వాళ్లందరికీ చెప్పా. ఆ ఒక్క మాట అబద్ధం చెప్పని కారణంగా, ఆ ఒక్క రోజు అధర్మం చేయని కారణంగా ఒక్క శాతం ఓట్ల తేడాతో ఐదేండ్లు ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వచ్చిందన్నారు. ఒక్క అబద్ధం చెప్పి ఉంటే జగన్ అధికారంలో ఉండేవాడు.. చంద్రబాబు ప్రతిపక్షంలో ఉండేవాడని అన్నారు. దానివల్ల అధికారంలోకి రాకపోవచ్చు.. కానీ ప్రజల్లో మాత్రం విశ్వసనీయత అంటే జగనే అని నమ్ముతున్నారని అన్నారు.