విజయవాడ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ అబద్ధాలు చెబుతూ కాలం వెల్లదీస్తున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. ఆయన రెండున్నరేండ్ల పాలనలో అభివృద్ధి జాడే లేకుండా పోయిందని విమర్శించారు. అభివృద్ధి సంగతి పక్కన పెడితే.. ఈ రెండున్నరేండ్లలో జగన్ బారిన పడని వర్గమంటూ ఏదీ ఉండదని ఫైరయ్యారు. తెలుగుదేశం పార్టీ అమలు చేసిన సంక్షేమ పథకాలను కూడా జగన్ ప్రభుత్వం సిగ్గులేకుండా తమవిగా ప్రచారం చేసుకుంటున్నదని అన్నారు. శనివారం ఆయన విజయవాడలోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.
ఏపీ సీఎం జగన్ అబద్ధాలు చెప్పడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు కనపడుతున్నదని అచ్చెన్నాయుడు అన్నారు. చిరుద్యోగుల జీతాలపై కూడా ప్రభుత్వం అబద్దాలు ఆడుతూ లబ్ది పొందాలని ప్రయత్నిస్తుందని ఆయన మండిపడ్డారు. అందరినీ తమ అబద్ధాలతో పక్కదారి పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారని, కానీ ఆ అబద్ధాలు ఎక్కువ కాలం నిలువవని గుర్తించాలని అచ్చెన్నాయుడు సూచించారు.
జగన్ నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వంలో అన్ని రంగాలు కుదేలయ్యాయని, ప్రభుత్వం కుంటి సాకులతో కాలం వెల్లదీస్తున్నదని అచ్చెన్నాయుడు మండిపడ్డారు. రాష్ట్రంలో ఏ ఒక్క వర్గం కూడా సంతోషంగా లేదని, ప్రజాసంక్షేమాన్ని పక్కన పెట్టి కేవలం స్వార్ధంతో అధికారాన్ని వెలగబెడుతున్నారని విమర్శించారు. జగన్ మళ్లీ అధికారంలోకి రావడం కల్ల అని, టీడీపీ వైపే ప్రజలు చూస్తున్నారని అచ్చెన్నాయుడు చెప్పారు.