ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రధాని మోదీతో సమావేశమయ్యారు. దాదాపు గంట పాటు వీరిద్దరి భేటీ కొనసాగింది. ఈ సందర్భంగా సీఎం జగన్ ప్రధానికి తిరుపతి వేంకటేశ్వర స్వామి చిత్ర పటాన్ని బహూకరించారు. ఇక.. పోలవరం విషయంలో సవరించిన అంచనాలను ఆమోదించాలని సీఎం జగన్ ప్రధానిని కోరినట్లు తెలుస్తోంది. అలాగే ఏపీకి ఆర్థిక చేయూతను కూడా అందించాలని, విభజన చట్టంలోని పెండింగ్ అంశాలను పూర్తి చేయాలని సీఎం ప్రధాని మోదీని కోరినట్లు సమాచారం.
ఇక ప్రధానితో భేటీ ముగిసిన తర్వాత పలువురు కేంద్ర మంత్రులను కూడా ఏపీ సీఎం కలుసుకోనున్నారు. మంగళవారం రాత్రి 7 గంటల ప్రాంతంలో జగన్ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ కానున్నారు. ఇక ఈ భేటీ తర్వాత రాత్రి 9 గంటల ప్రాంతంలో కేంద్ర హోంమంత్రి అమిత్షాతో కూడా జగన్ భేటీ కానున్నారు.