అమరావతి : ఆంధ్రప్రదేశ్లో కొత్త జిల్లాలతో సరికొత్త శకానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శ్రీకారం చుట్టారు. వర్చువల్గా కొత్త జిల్లాలను ప్రారంభించగా. నేటి నుంచి కొత్త జిల్లాల్లో కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 13 జిల్లాలు 26 వరకు పెరిగాయి. అలాగే రెవెన్యూ డివిజన్లు 72కు పెరగ్గా.. కొత్త జిల్లాల్లో కలెక్టర్లు, ఎస్పీలు బాధ్యతల స్వీకరించారు.
ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ ఇవాళ మంచి పనికి శ్రీకారం చుట్టామన్నారు. రాష్ట్ర ప్రజలకు మంచి జరిగే గొప్ప రోజుగా అభివర్ణించారు. 26 జిల్లాల ఆంధ్రరాష్ట్రంగా రూపు మారిందని, కొత్తగా పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఏలూరు ఎన్టీఆర్, పల్నాడు, బాపట్ల, నంద్యాల, సత్యసాయి, తిరుపతి, అన్నమయ్య జిల్లాలు ఉనికిలోకి వచ్చాయన్నారు. గతంలో ఉన్న జిల్లాల పేర్లు అలాగే ఉన్నాయని తెలిపారు. గతంలో ఉన్న 13 జిల్లాలో కేంద్రాలను అలాగే కాపాడుకున్నామని, 1970 మార్చిలో ప్రకాశం జిల్లా, 1979 జూన్లో విజయనగరం జిల్లా ఏర్పాటైందని గుర్తు చేశారు.
ఈ రెండు జిల్లాలో 70 ఏళ్ల చరిత్రలో ఏర్పడిన కొత్త జిల్లాలన్నారు. పరిపాలన సౌలభ్యం, పాలనావికేంద్రీకరణ అవసరం మేరకే కొత్త జిల్లాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. కలెక్టర్లకు అధికారంతో పాటు ప్రజల పట్ల బాధ్యత పెరిగిందన్నారు. ప్రజల అవసరాలు, ఆకాంక్షలకు అనుగుణంగా మార్పులు అవసరమని, ప్రజలకు మరింత చేరువ కావాలని మార్పులు చేశామన్నారు.