Chandrababu | పేదలకు అండగా కూటమి ప్రభుత్వం ఉంటుందని.. చివరి రక్తపు బొట్టు వరకు ప్రజల కోసమే పనిచేస్తానని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. ప్రజలకు కష్టాలు లేని, ఇబ్బందులు లేని సుపరిపాలన అందించేందుకు కృషి చేస్తున్నామని స్పష్టం చేశారు. లంచాలు లేకుండా ప్రజలకు సుపరిపాలన అందించే బాధ్యత తీసుకున్నామని తెలిపారు. విజయనగరం జిల్లా దత్తి గ్రామంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడుతూ.. ఇచ్చే సంక్షేమం, చేసే అభివృద్ధి వల్ల ఆర్థికంగా వృద్ధిలోకి వచ్చిన వారు సమాజంలో అట్టడుగున ఉన్నవారిని ఆదుకోవాలని పిలుపునిచ్చారు.
ఉత్తరాంధ్రకు న్యాయం జరగాలన్న ఉద్దేశంతో భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణ పనులు చేపట్టామని చంద్రబాబు నాయుడు తెలిపారు. ఎప్పుడో పూర్తి కావాల్సిన ప్రాజెక్టును కూడా గత పాలకులు ఆలస్యం చేశారని మండిపడ్డారు. కూటమి అధికారంలోకి వస్తూనే ఈ ప్రాజెక్టును పరుగులు పెట్టిస్తున్నామని తెలిపారు. 2026 ఆగస్టుకు భోగాపురం విమానాశ్రయం ప్రారంభిస్తామని వెల్లడించారు. ఆ తర్వాత ఈ ప్రాంతానికి పెద్ద ఎత్తున పరిశ్రమలు వస్తాయని తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. సంక్షేమం ఇవ్వడమే కాదు.. రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు.
పీ4 ద్వారా లక్ష మంది మార్గదర్శకులు 10 లక్షల మంది పేదల్ని వృద్ధిలోకి తీసుకొస్తారని చంద్రబాబు తెలిపారు. ఆర్థిక అసమానతలు తగ్గించి మెరుగైన జీవన ప్రమాణాలు అందించేందుకు పీ4 కార్యక్రమాన్ని చేపట్టామని చంద్రబాబు తెలిపారు. రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్య సృష్టించే ప్రయత్నం చేస్తే ఖబడ్దార్ అని హెచ్చరించారు. ఆడబిడ్డలకు స్వేచ్ఛ, రక్షణ కల్పించడంలో కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ప్రజలు ఆశీర్వదిస్తేనే టీడీపీ, జనసేన, కూటమిలుగా ప్రభుత్వంగా ఏర్పాటు చేశాయని అన్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్తో రాష్ట్రం బాగుపడుతుందని తెలిపారు. ప్రజలకు సేవలందించాల్సిన బాధ్యత ప్రభుత్వ ఉద్యోగులదని పేర్కొన్నారు. బాగా పనిచేయకపోతే గతంలో తిట్టేవాడిని అని.. ఇప్పుడు ప్రజల ముందు నెలబెడతానని హెచ్చరించారు.