Chandrababu | ఏపీలో పెట్టుబడులు పెట్టండి.. అనుమతుల్లో ఎలాంటి జాప్యం ఉండదని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. 45 రోజుల్లోనే అనుమతులు మంజూరు చేసి త్వరితగతిన ఉత్పత్తికి ప్రోత్సాహం అందిస్తున్నామని చెప్పారు. విశాఖలోని నోవాటెల్లో నిర్వహించిన ఇండియా – యూరప్ బిజినెస్ పార్టనర్షిప్ రౌండ్ టేబుల్ సమావేశంలో చంద్రబాబు నాయుడు పాల్గొని ప్రసంగించారు. విశాఖ అద్భుతమైన సాగర తీర నగరమని.. మంచి వనరులు ఈ ప్రాంతంలో ఉన్నాయని తెలిపారు.
అమెరికా వెలుపల గూగుల్ అతిపెద్ద ఏఐ డేటా సెంటర్ను విశాఖలోనే ఏర్పాటు చేస్తోందని చంద్రబాబు నాయుడు అన్నారు. సబ్ సీ కేబుల్ కూడా ఈ ప్రాంతం నుంచే ఏర్పాటు అవుతోందని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా వచ్చిన ఆర్థిక సంస్కరణల తర్వాత పరిస్థితులు అన్నీ మారిపోయాయని అన్నారు. జీవన ప్రమాణాలు గణనీయంగా పెరిగాయని.. వాటికి అనుగుణంగా సంపద పెరగాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. దీనికోసం ఏపీలో వివిధ రకాల పరిశ్రమల్ని ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. ఇందులో భాగంగానే అమరావతిలో తొలి క్వాంటం వ్యాలీని ఏర్పాటు చేయబోతున్నామని వెల్లడించారు. అలాగే డ్రోన్లు కూడా పెద్ద ఎత్తున వినియోగంలోకి తీసుకొస్తామని చెప్పారు. సివిల్ అప్లికేషన్స్, డిఫెన్స్ రంగాల్లో వీటి తయారీ పెరగాలని.. అందుకే ఏపీలో డ్రోన్ సిటీ ఏర్పాటు చేసి ఉత్పత్తి చేయాలని నిర్ణయించామని అన్నారు.
స్పేస్ అప్లికేషన్స్ కూడా రోజురోజుకీ పెరుగుతున్నాయని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఏపీలో స్పేస్ సిటీని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఇప్పుడు గ్రీన్ ఎనర్జీ ప్రాధాన్యం కూడా గణనీయంగా పెరిగిందని.. సౌర, పవన, పంప్డ్ ఎనర్జీ రంగాల్లో తాము బలంగా ఉన్నామని పేర్కొన్నారు. ఏపీలో పెద్ద ఎత్తున పోర్టులు నిర్మిస్తున్నామని చెప్పారు. గ్రీన్ ఎనర్జీ రంగంలో భారత్ 500 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుందని.. అందులో 160 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయాలని ప్రయత్నిస్తున్నామని తెలిపారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే విధానాన్ని అమలు చేసి యుద్ధ ప్రాతిపదికన అనుమతులు ఇస్తున్నామని చెప్పారు.