AP CEO | మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం పగలగొట్టిన వీడియో బయటకు రావడం పట్ల ఏపీ సీఈవో ముకేశ్ కుమార్ మీనా సంచలన ప్రకటన చేశారు. ఆ వీడియోను తాము విడుదల చేయలేదని ఏపీ సీఈవో ఎంకే మీనా వెల్లడించారు. ఆ వీడియో ఎన్నికల కమిషన్ నుంచి బయటకు వెళ్లలేదని.. ఎలా బయటకు వెళ్లిందో తెలుసుకుంటామని తెలిపారు. గురువారం నాడు మీడియా చిట్చాట్లో పాల్గొన్న ఎంకే మీనా.. దర్యాప్తు సమయంలో వీడియో బయటకు వెళ్లి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. ఈవీఎం ధ్వంసం ఘటన విషయంలో అధికారులపై చర్యలు తీసుకున్నామని చెప్పారు. సరైన సమాచారం అందివ్వనందుకుగానూ పాల్వాయిగేటు పోలింగ్ బూత్లో విధుల్లో పాల్గొన్న పీవో, ఏపీవోలను సస్పెండ్ చేశామని తెలిపారు.
మాచర్ల నియోజకవర్గంలో జరిగిన అల్లర్లలో గాయపడి కార్యకర్తలను పరామర్శించేందుకు టీడీపీ నేతలు వెళ్లడం మంచిది కాదని సీఈవో మీనా సూచించారు. మాచర్లలో పరిస్థితులు ఇప్పుడే అదుపులోకి వచ్చాయని.. టీడీపీ నేతలు పరామర్శకు వెళ్తే.. వైసీపీ నాయకులు కూడా వెళ్తామని అంటారని పేర్కొన్నారు. దీంతో మాచర్లలో మళ్లీ పరిస్థితి అదుపుతప్పే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. పిన్నెల్లిని అరెస్టు చేసేందుకు హైదరాబాద్లో ఒక టీమ్ పనిచేస్తుందని తెలిపారు. అడిషనల్ ఎస్పీ, డీఎస్పీ, నలుగురు సీఐలు వెతుకుతున్నారని పేర్కొన్నారు. పిన్నెల్లి విషయంలో సెక్షన్లు కఠినంగా ఉన్నాయని.. ఆయనకు శిక్ష తప్పదని స్పష్టం చేశారు.