అమరావతి : ఏపీ క్యాబినెట్ సమావేశం ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన ఇవాళ మధ్యాహ్నం సచివాలయంలో జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలకు క్యాబినెట్ ఆమోదం ముద్ర వేసింది. ఏపీ మిల్లెట్ మిషన్ 2022-23 నుంచి 2026-27 పాలసీకి ఆమోదం తెలిపింది. విద్య, వైద్య, ప్రణాళిక శాఖల్లో నియామకాలకు ఆమోదం తెలియజేసింది. రాష్ట్రంలో పులివెందుల, కొత్తపేట రెవెన్యూ డివిజన్లకు , వైఎస్సార్ సున్నా వడ్డీ పథకానికి కేబినెట్ ఆమోదించింది.
డిగ్రీ కళాశాలల్లో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీ, డిగ్రీ కళాశాలల్లో 574 పోస్టుల భర్తీ, పంచాయతీరాజ్ చట్ట సవరణ ఆర్డినెన్స్, ఏపీ టూరిజం కార్పొరేషన్కు 6 ఎకరాలు ఉచితంగా కేటాయించే ప్రతిపాదనకు క్యాబినెట్ సమావేశం ఆమోద ముద్ర వేసింది . రాజమహేంద్రవరంలో హోటల్ కమ్ కన్వెన్షన్ సెంటర్కు స్థల ప్రతిపాదన, ఐదు జిల్లాలో ఆస్పత్రుల నిర్మాణానికి భూ కేటాయింపుల ప్రతిపాదన, హెల్త్ హబ్ పథకం కింద ఆస్పత్రుల నిర్మాణానికి భూ కేటాయింపులు, రాజమహేంద్రవరం , కర్నూలు, విజయనగరం జిల్లాల్లో ఆస్పత్రులు , అనంతపురం, శ్రీకాకుళం జిల్లాల్లో హెల్త్ హబ్ పథకం కింద ఆస్పత్రులకు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది.
కర్నూలు జిల్లా కొలిమిగుండ్లలో పారిశ్రామిక పార్కుకు 82 ఎకరాల కేటాయింపు ,జడ్పీల కాలపరిమితి ముగిసే వరకు కొనసాగించేందుకు చట్ట సవరణల నిర్ణయంపై కూడా మంత్రివర్గంలో చర్చించారు.