తిరుమల: తిరుమలలో (Tirumala) మరో చిరుతపులి (Leopard) చిక్కింది. తిరుమల నడకదారిలోని లక్ష్మీ నరసింహస్వామి (Lakshmi Narasimhaswamy) ఆలయం సమీపంలో ఏర్పాటు చేసిన బోనులో చిరుత చిక్కినట్లు అధికారులు వెల్లడించారు. ఈ నెల 14న తెల్లవారుజామున అదే ప్రాంతంలో ఓ చిరుత చిక్కిన విషయం తెలిసిందే.
ఇటీవల అలిపిరి కాలినడక మార్గంలో (Step way) చిరుత దాడి చేయడంతో నెల్లూరు (Nelloor) జిల్లాకు చెందిన ఆరేండ్ల లక్షిత (Lakshitha) అనే బాలిక మృతి చెందింది. అంతుకుముందు మరో బాలుడిని నోట కరుచుకుని వెళ్లిన చిరుతపులి.. అడవిలో వదిలేసింది. ఇలా వరుసగా దాడులు చేస్తుండటంతో మెట్ల మార్గంలోని నాలుగు ప్రాంతాల్లో అటవీశాఖ, టీటీడీ అధికారులు బోన్లను ఏర్పాటు చేశారు. ఏడో మైలు నుంచి లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయం వరకు అధికారులు నిఘాపెట్టారు. దీంతో మూడు రోజుల వ్యవధిలోనే రెండు చిరుత పులులు బోనుకు చిక్కాయి. కాగా, తిరుమల అడవుల్లో మొత్తం ఐదు పులులు ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు.