Srisailam | శ్రీశైలం వెళ్లే భక్తులకు ముఖ్య గమనిక. చంద్ర గ్రహణం సందర్భంగా రేపు ( సెప్టెంబర్ 7వ తేదీన) అన్నపూర్ణ భవన్లో ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే అన్నప్రసాద వితరణ ఉంటుందని ఆలయ ఈవో తెలిపారు. ఈ మేరకు ఒక ప్రెస్నోట్ రిలీజ్ చేశారు.
చంద్ర గ్రహణం సందర్భంగా అన్నప్రసాద వితరణలో చేసిన మార్పును భక్తులు గమనించాల్సిందిగా ఈవో సూచించారు. అలాగే చంద్ర గ్రహణం సందర్భంగా శ్రీశైలం ఆలయాన్ని మూసివేయనున్నట్లు తెలిపారు. సెప్టెంబర్ 7వ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సెప్టెంబర్ 8వ తేదీ ఉదయం 5 గంటల వరకు ఆలయ ద్వారాలు మూసివేయనున్నట్లు పేర్కొన్నారు.
చంద్రగ్రహణం ఈ నెల 7వ తేదీ రాత్రి 9.56 గంటలకు ప్రారంభమై.. రాత్రి 1.26 గంటలకు ముగుస్తుంది. ఈ నేపథ్యంలో రేపు స్వామివారి స్పర్శ దర్శనాన్ని పూర్తిగా నిలిపివేశారు. అలాగే ఆలయంలోని అన్ని ఆర్జిత సేవలు, పరోక్ష సేవలు, శ్రీస్వామి అమ్మవార్ల కల్యాణోత్సవం పూర్తిగా నిలిపివేసినట్లు ఆలయ ఆధికారులు తెలిపారు. భక్తులందరికీ అలంకార దర్శనం మాత్రమే కల్పించబడుతుందని పేర్కొన్నారు. అలాగే సాక్షి గణపతి, హాఠకేశ్వరం, పాలధార, పంచధార, శిఖరేశ్వరం మొదలైన పరివార ఆలయాల ద్వారాలను కూడా మూసివేయనున్నట్లు వెల్లడించారు.