అమరావతి : ఆంధ్రప్రదేశ్లో పరిషత్ ఎన్నికల నోటిఫికేషన్ రద్దయ్యింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ను రద్దు చేస్తూ ఆ రాష్ట్ర హైకోర్టు శుక్రవారం సంచలన తీర్పునిచ్చింది. ఎన్నికలకు కొత్తగా నోటిఫికేషన్ ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. ఏపీలో ఈ ఏడాది ఏప్రిల్ 8న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే.
పోలింగ్ జరిగినప్పటికీ హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఆ ఓట్లను లెక్కించలేదు. ఈ అంశంపై మే 4న విచారణ చేపట్టిన హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఇవాళ ఈ అంశంపై మరోసారి కోర్టు విచారణ నిర్వహించింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా ఎస్ఈసీ ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వలేదని, పోలింగ్కు 4 వారాల ముందు నోటిఫికేషన్ ఇవ్వాలన్న ఆదేశాలను పట్టించుకోలేదని హైకోర్టు పేర్కొంది. ఈ మేరకు ఎన్నికల నోటిఫికేషన్ను రద్దు చేస్తూ తీర్పునిచ్చింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.