AP News | ఏపీలోని పల్నాడులో ఘోరం జరిగింది. కుటుంబ కలహాలతో భర్త మర్మాంగాలపై ఓ భార్య సలసల మసులుతున్న నీటిని పోసింది. దీంతో తీవ్ర గాయాలైన భర్త.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
వివరాల్లోకి వెళ్తే.. పల్నాడు జిల్లా వినుకొండ పట్టణంలోని హనుమాన్నగర్లో నాయిని ప్రభుదాస్, అనూష దంపతులు కొంతకాలంగా నివసిస్తున్నారు. ప్రభుదాస్ నెలవారీ పద్ధతిలో వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే కొంతకాలంగా దంపతుల మధ్య విభేదాలు రావడంతో వేర్వేరుగా ఉంటున్నారు. దీంతో అనూష తల్లిదండ్రులు కలుగజేసుకుని పెద్దల మధ్య సయోధ్య కుదిర్చారు. వారం కిందట అనూషను కాపురానికి పంపించారు. ఇంతలోనే భార్యభర్తల మధ్య ఏమైందో తెలియదు గానీ.. ఆదివారం తెల్లవారుజామున నిద్రిస్తున్న భర్త దగ్గరకు వెళ్లిన అనూష.. అతని మర్మాంగంపై సలసల కాగుతున్న వేడి నీటిని పోసింది. వేడి వేడి నీళ్లు పడటంతో ప్రభుదాస్ ఒక్కసారిగా కేకలు వేశాడు. అతని అరుపులు విన్న స్థానికులు వెంటనే చికిత్స నిమిత్తం ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. వేడి నీళ్లు పడటంతో మర్మాంగంతో పాటు కడుపు భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. కాగా, తన అత్తామామలే భార్యతో తనను చంపించేందుకు కుట్ర పన్నారని బాధితుడు ప్రభుదాస్ ఆరోపించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు.