అమరావతి: నైరుతి బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. దాని పరిసరాల్లో నైరుతి బంగాళాఖాతం ఏర్పడిన ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి సగటున 3.1 కి.మీ ఎత్తు వరకు విస్తరించి ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ కారణంగా మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
కోస్తాంధ్ర జిల్లాల్లో మాత్రం రానున్న మూడు రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. రాయలసీమలో గురు, శుక్రవారాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. కాగా, గుంటూరు జిల్లా గురజాల, దాచేపల్లి, మాచవరం మండలాలతో పాటు ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం, మార్కాపురం, దోర్నాల మండలాల్లో బుధవారం వర్షం కురిసింది.