న్యూఢిల్లీ : స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడే ప్రధాన కుట్రదారుడని ఏపీ సీఐడీ (CID) చీఫ్ సంజయ్ పేర్కొన్నారు. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో ఈ అవినీతికి ప్రధాన సూత్రధారిగా వ్యవహరించారని ఆరోపించారు. ఢిల్లీలో ఆదివారం జరిగిన మీడియా సమావేశంలో సంజయ్ ఈ వివరాలను వెల్లడించారు. ఈ స్కామ్తో రూ. 371 కోట్ల ప్రజాధనం కాజేశారని అన్నారు. సీమెన్స్ కంపెనీకి నాటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ సొమ్మును కట్టబెట్టిందని, కేవలం నామినేషన్తో ప్రజాధనాన్ని ప్రభుత్వం వెచ్చించిందని ఆరోపించారు.
సీమెన్స్కు ఇచ్చిన రూ. 371 కోట్లలో రూ. 241 కోట్లు ఇతర ప్రైవేట్ కంపెనీలకు వెళ్లడాన్ని ఈడీ కూడా ప్రశ్నించిందని అన్నారు. చంద్రబాబు సీఎం పదవిని అడ్డుపెట్టుకుని ఈ మొత్తం వ్యవహారాన్ని నడిపించారని సీఐడీ, ఈడీ కూడా దీన్ని గుర్తించిందని చెప్పారు. జర్మనీ కేంద్రంగా పనిచేస్తున్న సీమెన్స్ ఈ తతంగంతో తమకు సంబంధం లేదని స్పష్టం చేసిందని తెలిపారు. చంద్రబాబుతో పాటు నాటి నైపుణ్యాభివృద్ధి మంత్రి క్యాబినెట్ ముందు తప్పుడు అంచనాలను పొందుపరిచారని, ఈ కేసులో చంద్రబాబే ప్రధాన కుట్రదారని సంజయ్ పేర్కొన్నారు.
కాగా సీఐడీ ఆరోపణలను సీమెన్స్ ఎండీ సుమన్ బోస్ తోసిపుచ్చారు. ఈ ప్రాజెక్టులో ఎలాంటి అవినీతి జరగలేదని, అంతటా పారదర్శకత పాటించామని పేర్కొన్నారు. ఎలాంటి షెల్ కంపెనీలు లేవని, నకిలీ ఇన్వాయిస్లపై సీఐడీ తగిన ఆధారాలు చూపాల్సి ఉంటుందని అన్నారు. కాగా స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో అరెస్టయిన చంద్రబాబును సెప్టెంబర్ 10న 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీకి తరలించారు.
Read More :