తిరుమల : దివంగత మల్లాది చంద్రశేఖర శాస్త్రి నడిచే పురాణ గ్రంథమని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి కొనియాడారు. టీటీడీ కి ఆయన అందించిన సేవలు అమూల్యమని శనివారం ఒక ప్రకటనలో సంతాపం వ్యక్తం చేశారు. చంద్ర శేఖర శాస్త్రి పురాణ ప్రవచనానికి ఒక స్థాయి కల్పించిన మహానుభావుడని అన్నారు. టీటీడీ పురాణ ప్రబోధ కళాశాలకు ప్రిన్సిపల్ గా పని చేసిన కాలంలో ఎందరో ఉత్తమ ప్రవచన కర్తలను ఆయన తయారు చేశారని చెప్పారు.
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల వ్యాఖ్యాన కర్తగా, ధార్మిక ఉపన్యాస కర్తగా స్వామివారి సేవలో తరించారని పేర్కొన్నారు. శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ లో ప్రజల ధర్మ సందేహాలను నివృత్తి చేశారన్నారు. శాస్త్రి ఆరు దశాబ్దాల పాటు అనేక రూపాల్లో హిందూ ధర్మ ప్రచారాన్ని కొనసాగించారని అన్నారు. చంద్రశేఖర శాస్త్రి ఆత్మకు శ్రీ వేంకటేశ్వర స్వామి వారు శాంతి కలిగించాలని, వారి కుటుంబ సభ్యులకు మనో ధైర్యం ప్రసాదించాలని కోరారు. శాస్త్రి కుటుంబానికి టీటీడీ అండగా ఉంటుందన్నారు.