అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మూడు రాజధానులు, సీఆర్డీఏ చట్టాల రద్దుపై హైకోర్టు ఇచ్చిన తీర్పు పట్ల అమరావతి రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తీర్పు వెలువడిన వెంటనే అమరావతి రాజధాని పరిరక్షణ సమితి నాయకులు గత 807 రోజులుగా వెలగపూడిలో చేస్తున్న దీక్షా శిబిరం వద్ద సంబురాలు నిర్వహించారు. పటాకులు కాల్చుతూ, స్వీట్లు పంచిపెట్టారు. హైకోర్టుకు ధన్యవాదాలు తెలుపుతూ హైకోర్టు వద్ద సాష్టాంగ నమస్కారం చేశారు. న్యాయం, ధర్మం గెలిచిందని నినాదాలు చేశారు. న్యాయం బ్రతికే ఉందని కోర్టు మరోసారి నిరూపించిందని నాయకులు పేర్కొన్నారు.
ఏపీ సీఎం జగన్ అమరావతి రైతులపై త్రాచుపాములా పగబట్టారని ఇప్పటికైని పంతాలకు పోయి రాష్ట్రాన్ని నాశనం చేయొద్దని రైతులు అన్నారు. కామదేనువు లాంటి అమరావతిని అభివృద్ధి చేయాలని సూచించారు. హైకోర్టు తీర్పు ప్రకారం ఆరు నెలల వరకు ప్రభుత్వం తమ ప్లాట్లను అభివృద్ధి చేసేంతవరకు తమ ఆందోళనను కొనసాగిస్తుందని వెల్లడించారు.
ఏపీలో వైసీపీ ప్రభుత్వాన్ని నమ్మే పరిస్థితిలో లేమని, ప్రభుత్వం ఇంకా పైకోర్టుకు వెళితే తాము కూడా వెళ్తామని, అంతిమంగా ఏపీకి రాజధాని అమరావతే అయ్యేంతరకు తమ ఆందోళన కొనసాగుతుందని పేర్కొన్నారు. 2019 డిసెంబర్ 17న ఏపీ అసెంబ్లీలో మూడు రాజధానుల బిల్లును ప్రకటిస్తు నిర్ణయం తీసుకోవడంతో అప్పటి నుంచి 807 రోజులుగా వెలగపూడి గ్రామంలో రైతులు దీక్షను నిర్వహిస్తున్నారు.