శ్రీశైలం : శ్రీశైల మహా క్షేత్రంలో అమావాస్య ప్రత్యేక పూజలను శాస్తోక్తంగా అర్చక వేదపండితులచే నిర్వహించారు. అత్యంత శక్తివంతుడు, మహిమాన్వితుడైన క్షేత్ర పాలకుడు బయలు వీరభద్రస్వామికి బుధవారం ప్రదోషకాల సమయంలో పంచామృతాలు, ఫలోదకాలు, పసుపు కుంకుమ విభూది గంధజలాలు, బిల్వోదక సుగంధ ద్రవ్యాలు, శుద్ధజలాలతో అభిషేకాలు విశేష పుష్పార్చన, మహా నైవేద్య కార్యక్రమాలు ఈవో కేఎస్ రామారావు ఆధ్వర్యంలో చేశారు.
లోకకళ్యాణార్థం ప్రతి మంగళవారం అదేవిధంగా అమావాస్య రోజుల్లో స్వామివారికి అభిషేకార్చనలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆరుబయట ఆలయంలో దర్శనమిచ్చే స్వామిని పూజించడం వల్ల భూత ప్రేత పిశాచ దుష్ట గ్రహదోషాలు తొలిగి సర్వకార్యానుకూలతతో పాటు ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయని ప్రధాన అర్చకుడు భద్రయ్య తెలిపారు.
కొవిడ్ కారణంగా శ్రీశైల క్షేత్రానికి చేరుకోలేక దేశ విదేశాలలో ఉండే భక్తుల అభ్యర్థన మేరకు క్షేత్రపాలకునికి జరిగే అమావాస్య క్రతువులను పరోక్షసేవగా అందించడం పట్ల అనుహ్య స్పందన లభించిందని ఈవో కేఎస్ రామారావు తెలిపారు. పరోక్ష సేవలో పాల్గొనేందుకు Srisailadevasthanam.org వెబ్ సైట్ లోనమోదు చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమాన్ని శ్రీశైల టీవీ ఛానల్ సోషల్ మీడియా ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు శ్రీశైల ప్రభ సంపాదకుడు అనీల్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానాచార్యులు పూర్ణానంద ఆరాధ్యులు, ప్రధానార్చకుడు భద్రయ్య, ఏఈవో హరిదాసు, అయ్యన్నలు పాల్గొన్నారు.