మంగళగిరి: ఆంధ్రప్రదేశ్ రాజధాని సమస్యకు వైసీపీ ప్రభుత్వమే కారణమని, అమరావతి రైతులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎలాంటి భరోసా ఇవ్వకుండా వికేంద్రీకరణతో ముందుకు వెళ్లడం వల్లే సమస్య మొదలైందని బీజేపీ ఎంపీ టీజీ వెంకటేష్ ఆరోపించారు. మూడు రాజధానులపై మళ్లీ చట్టం చేసి కోర్టుకు వెళ్తే ఎలాంటి ప్రయోజనం ఉండదని, అమరావతినే రాజధానిగా ఉంచి అభివృద్ధి చేయాలని ఆయన చెప్పారు.
ముఖ్యమంత్రి గందరగోళంలో పరిపాలన చేస్తే రాష్ట్రం సవ్యంగా ఉండదని, రాజధానిని ముక్కలు చేయకుండా ఒక చోట సెక్రటేరియట్, మరోచోట శీతాకాల సమావేశాలు, ఇంకోచోట వేసవికాల సమావేశాలు నిర్వహిస్తే సమస్య పరిష్కారం అవుతుందని సూచించారు. తన సలహాలు వింటే ఈ విషయంలో బీజేపీని ఒప్పించే బాధ్యత తీసుకుంటానని టీజీ వెంకటేశ్ ప్రకటించారు. జగన్ ప్రభుత్వం మూడు రాజధానుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో మంగళవారం నాడు కర్నూలులో విలేకరులతో టీజీ వెంకటేష్ మాట్లాడారు. అమరావతిని రాజధానిగా ఉంచి, కర్నూలులో వేసవి లేదా శీతాకాల రాజధాని పెట్టాలని రాయలసీమ ఐక్యవేదిక మొదటి నుంచి డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. అశోకుడి పాలనలో కర్నూలు జిల్లాలోని జొన్నగిరి రాజధానిగా ఉండేదని, తమ ప్రాంతంలో రాజధాని ఏర్పాటు చేయాలని శ్రీకృష్ణ కమిటీకి తెలియజేశామని చెప్పారు.
వెంటనే కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేసి, తర్వాత హైకోర్టు కోసం ప్రయత్నం చేయాలని, లేకపోతే రెండూ పోతాయని టీజీ తెలిపారు. విశాఖలో సెక్రటేరియట్ పెడితే తమ ప్రాంతానికి దూరం అవుతుందని, అందువల్ల కర్నూలులో కూడా మినీ సచివాలయం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రైతులు, భూములు పోగొట్టుకున్న వారికి న్యాయం చేయాలని కోరారు.