హైదరాబాద్: విమానం అండర్పాస్ కింద ఇరుక్కుపోవడం ఏంటి అనుకుంటున్నారా.. అవును ఇది నిజమే. హైదరాబాద్కు చెందిన ఓ ప్రముఖ రెస్టారెంట్ యజమాని కొచ్చిలో ఓ పాత విమానాన్ని కొనుగోలు చేశారు. నగర శివార్లలో ఉన్న షామీర్పేటలో ఆ విమానంలో కొత్తగా రెస్టారెంట్ను ఏర్పాటు చేయాలనుకున్నారు. ఇందులో భాగంగా కొచ్చి నుంచి ఆ విమానాన్ని ప్రత్యేక ట్రాలీపై హైదరాబాద్కు తరలిస్తున్నారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లా కోరిసపాడు అండర్పాస్ వద్ద ఇరుక్కుపోయింది.
విమానం ముందుభాగం బ్రిడ్జి కిందినుంచి బాగానే వెళ్లినప్పటికీ.. మధ్యలోకి వచ్చేసరికి వంతెన కిందిభాగానికి రాసుకుంది. దీంతో ట్రక్ డ్రైవర్ చాలాసేపు కష్టపడాల్సి వచ్చింది. లారీని మళ్లీ వెనక్కి తీసుకెళ్లిన డ్రైవర్.. ఎలాంటి నష్టం జరుగకుండా దానిని అండర్పాస్ దాటించాడు. ఈ క్రమంలో రోడ్డుకు ఇరువైపుల భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. పోలీసులు అక్కడికి చేరుకుని వాహనాలను క్రమబద్ధీకరించాల్సి వచ్చింది. కాగా, విమానం అండర్పాస్ కింద ఇరుక్కుపోయిందన్న వార్త తెలియడంతో భారీ సంఖ్యలో జనాలు అక్కడికి చేరుకున్నారు. విమానాన్ని ట్రక్కుపై తరలిస్తున్న దృష్యాలను తమ ఫోన్లలో బంధించారు. వాటిని కొందరు సామాజిక మాధ్యమాల్లో అప్లోడ్ చేయడంతో.. ప్రస్తుతం అవి తెగ వైరల్ అవుతున్నాయి.