Aghori : ఇటీవల రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన అఘోరీ (Aghori) ఆదివారం ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం (Srisailam) లో ప్రత్యక్ష మయ్యారు. కార్తీక మాసంలో ప్రముఖ శైవ క్షేత్రాలను వరుసగా సందర్శిస్తున్న అఘోరీ శ్రీశైలం శ్రీ మల్లిఖార్జున స్వామిని దర్శించుకున్నారు. అఘోరీ దిగంబరంగా స్వామివారిని దర్శించుకునే ప్రయత్నం చేయగా ఆలయ అధికారులు అడ్డుకున్నారు.
వస్త్ర ధారణ లేకుండా దర్శనానికి అనుమతించేది లేదని ముఖద్వారం వద్ద అఘోరిని ఆలయ సెక్యూరిటీ సిబ్బంది, పోలీసులు నిలిపేశారు. దాంతో ఆమె వస్త్రధారణ చేసుకుని స్వామి వారిని, అమ్మవార్లను దర్శించుకున్నారు. ఆలయంలోకి ప్రవేశించిన అఘోరీని భక్తులు ఆసక్తిగా తిలకించారు. చాలా మంది ఆమె ఆశీర్వాదం కోసం ప్రయత్నించారు. మహిళా పోలీసులు, ఆలయ సిబ్బంది ఆమెకు దగ్గరుండి స్వామివారి దర్శనం కల్పించారు.
ఈ సందర్భంగా అఘోరీ మాట్లాడుతూ.. సనాతన ధర్మ పరిరక్షణకు గురువుల ఆదేశానుసారం దేశంలో పర్యటిస్తున్నానని చెప్పారు. మహిళలపైన, చిన్నారులపైన, హిందూ దేవాలయాలపైన దాడులు నివారించబడేందుకు, లోక కల్యాణం కోసం తాను కృషి చేస్తున్నానని అన్నారు. కార్తీక మాసం సందర్భంగా ప్రముఖ శైవ క్షేత్రాలను సందర్శిస్తున్నానని తెలిపారు.