అమరావతి : ఏపీ అసెంబ్లీలో టీడీపీ అధినేత చంద్రబాబు కుటుంబ సభ్యులపై వైసీపీ నేతల వ్యాఖ్యలను నిరసిస్తూ సినీనటుడు నారా రోహిత్ ఆదివారం నారావారిపల్లెలో నిరసన తెలిపారు. ముందుగా చంద్రబాబు తల్లిదండ్రులు దివంగత నారా అమ్మణమ్మ, నారా కర్జూర నాయుడు సమాధుల వద్ద పూలమాలలు వేసి బైఠాయించి వైసీపీ నాయకుల తీరును ఖండించారు. రాజకీయలతో ఎలాంటి సంబంధం లేని పెద్దమ్మ నారా భువనేశ్వరిపై చట్ట సభలో ఆమె వ్యక్తిత్వ హననానికి పాల్పడడం ధారుణమని నారా రోహిత్ అన్నారు.
తమ పెదనాన్న చంద్రబాబు, పెద్దమ్మ భువనేశ్వరి, సోదరుడు నారా లోకేశ్ క్రమశిక్షణకు మారుపేరని అన్నారు. సేవా కార్యక్రమాలతో ముందుకు వెళ్తున్న ఆమె వ్యక్తిత్వంపై మాట్లాడడానికి నోరెలా వచ్చిందోనని మండిపడ్డారు. మరోసారి ఇలాంటి చర్యలకు పాల్పడితే సహించబోమని హెచ్చరించారు.. అనంతరం తిరుపతిలోని వరద బాధితులకు ఎన్టీఆర్ ట్రస్ట్ తరుఫున జరుగుతున్న సహాయ కార్యక్రమాలను నారా రోహిత్ పరిశీలించారు.