చిత్తూరు జిల్లా చంద్రగిరిలో జరిగిన బస్సు ప్రమాదంలో మృతుల సంఖ్య ఎనిమిదికి చేరింది. భాకరాపేట వద్ద ఘాట్రోడ్డులో ప్రయాణిస్తుండగా బస్సు లోయలో పడిపోయింది. తిరుపతిలో ఆదివారం పెండ్లి నిశ్చితార్థం కోసం పెండ్లి కొడుకు బంధువులు ఈ బస్సులో వస్తున్నారు. బస్సులో పెండ్లి కొడుకు వేణుతోపాటు 50 మంది కూడా ఉన్నారని సమాచారం.
ఈ ప్రమాదంలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. అలాగే ఘటనా స్థలంలోనే ఆరుగురు మృతిచెందారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఒక చిన్నారి, మరో వ్యక్తి మరణించినట్లు అధికారులు తెలిపారు. ప్రమాదంలో మరణించిన వారిని వెంగప్ప (60), మురళి (45), కాంతమ్మ (40), మలిశెట్టి గణేశ్ (40), డ్రైవర్ నబీ రసూల్, క్లీనర్ ఘటనా స్థలంలోనే గుర్తించారు. యశస్విని (8), ఆదినారాయణరెడ్డి ఆస్పత్రిలో మృతి చెందారు. బస్సు అతివేగమే ప్రమాదానికి కారణమని బాధితులు వాపోతున్నారు.