అమరావతి : ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ప్రభుత్వం అన్ని విధాల అన్యాయం చేస్తున్నారని టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. గడిచిన మూడేండ్లలో బీసీలకు ఏం చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన బీసీ నేతలతో సమావేశమయ్యారు. వైసీపీ మేనిఫెస్టోలో బీసీలకు అమలు కాని హామీలు, బీసీలపై దాడుల వంటి అంశాలపై సమావేశంలో చర్చించారు. బీసీలకు ఎన్నో పథకాలు తీసుకొచ్చింది టీడీపీ హయాంలోనేనని పేర్కొన్నారు. బలహీనవర్గాలను జగన్ ఉక్కుపాదంతో అణచివేస్తున్నారని ఆరోపించారు.
బలహీనవర్గాల నిధులను దారిమళ్లించిన ఘనత వైసీపీదేనని తెలిపారు. పైసా నిధులు కేటాయించకుండా బీసీ ఫెడరేషన్లు పెట్టారని విమర్శించారు. కొల్లు రవీంద్ర మాట్లాడుతూ బీసీలకు జరిగిన అన్యాయంపై చర్చకు సిద్ధమా అని ప్రశ్నించారు. బీసీలను జగన్ అన్ని విధాలా వంచించారని అన్నారు. బీసీ కార్పొరేషన్ను నిర్వీర్యం చేశారని విమర్శించారు.
సీనియర్ నాయకుడు యనమల మాట్లాడుతూ బీసీలకు కేటాయించిన నిధులు ఎక్కడికి పోతున్నాయో జగన్ చెప్పాలని డిమాండ్ చేశారు. బీసీల ఆలోచనలకు తగినవిధంగా పని చేసే నాయకత్వం అవసరమని పేర్కొన్నారు. బీసీలకు ప్రత్యేక పథకాలుండాలని డిమాండ్ చేశారు. బీసీలకు నాలుగు మంత్రి పదవులు ఇస్తే వారినేదో ఆదుకున్నట్లు కాదని స్పష్టం చేశారు.