అమరావతి : సముద్రపు స్నానానికి వెళ్లిన విద్యార్థుల్లో ఒకరు అలలకు కొట్టుకుపోగా మరో నలుగురిని పోలీసులు కాపాడిన ఘటన కృష్ణా జిల్లాలో చోటు చేసుకుంది. ఆదివారం ఉదయం నూజివీడు ట్రిపుల్ ఐటీ(Triple IT Students) కి చెందిన ఐదుగురు విద్యార్థులు మచిలీపట్నం తాళ్లపాలెం బీచ్లో స్నానానికి వెళ్లారు. అదే సమయంలో వచ్చిన పెద్ద అలలకు ఐదుగురు విద్యార్థులు కొట్టుకుపోయారు.
గమనించిన మెరైన్ పోలీసులు వెంటనే స్పందించి నలుగురు విద్యార్థులను సురక్షితంగా కాపాడారు. అయితే వీరిలో తోకల అఖిల్ అనే విద్యార్థి గల్లంతయ్యాడు. పోలీసుల గాలింపులో అఖిల్ మృతదేహాం మంగినపూడి బీచ్లో లభ్యమయ్యింది. మృతదేహాన్ని బయటకు తీసుకువచ్చి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.