Inter Student | కర్నూల్ : ఆ బాలికకు చదువంటే ఎంతో ఇష్టం. కానీ ఆర్థిక సమస్యల కారణంగానే ఆమెకు చిన్నతనంలోనే వివాహం చేయాలని పేరెంట్స్ నిర్ణయించారు. తనకు చదువుకోవాలని ఉందని చెప్పి ఆ బాలిక అధికారులకు మొరపెట్టుకుంది. అధికారుల సాయంతో బాలిక కేజీబీవీలో చేరింది. నిన్న విడుదలైన ఇంటర్ ఫలితాల్లో బాలిక టాపర్గా నిలిచింది.
వివరాల్లోకి వెళ్తే.. కర్నూల్ జిల్లా ఆదోని మండలానికి చెందిన ఎస్ నిర్మల చదువుల్లో ఫస్ట్. కానీ తల్లిదండ్రులు ఆర్థిక ఇబ్బందులను సాకుగా చూపి నిర్మలకి చిన్నతనంలోనే వివాహం చేయాలని భావించారు. చదువుకోవాలన్నపట్టుదలతో వివాహం నుంచి తప్పించుకోగా జిల్లా యంత్రాంగం ఆమెను చేరదీసి ఆలూరు కేజీబీవీలో చేర్పించారు. ప్రభుత్వం అండగా నిలవడంతో నిర్మల చక్కగా చదువుకుని బైపీసీలో 440కి 421 మార్కులు సాధించింది.
ఈ సందర్భంగా పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్.. నిర్మలను ప్రత్యేకంగా అభినందించారు. ఐపీఎస్ అధికారి కావాలనే ఆమె కల సామాజిక న్యాయం, బాల్య వివాహాల నిరోధంపై ఆమెకున్న తిరుగులేని నిబద్ధతను ప్రతిబింబిస్తోందని ప్రశంసించారు.