Sad News | ఓ తల్లి తీసుకున్న నిర్ణయం మూడు నెలల చిన్నారిని బలితీసుకుంది. ఆత్మహత్య చేసుకుందామని భావించి విషం తాగిన ఓ మహిళ.. ఏడుస్తున్న బిడ్డకు పాలివ్వడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ హృదయ విదారక ఘటన ఏపీలోని నంద్యాల జిల్లాలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. సిరివెళ్ల మండలం ఎర్రగుంట్లకు చెందిన ఇందుమతి(26) కుటుంబ కలహాలతో విసిగిపోయిన ఓ మహిళ తనువు చాలించాలని భావించింది. ఈ క్రమంలో ఆత్మహత్య చేసుకుందామని నిర్ణయించుకుని.. బుధవారం ఉదయం విషం (కల్లాపి పౌడర్) తాగింది. ఇంతలోనే తన మూడు నెలల చిన్నారి గుక్కబెట్టి ఏడుస్తూ కనిపించింది. దీంతో తల్లి మనసు ఆపుకోలేక ఆ చిన్నారికి పాలుపట్టింది. అప్పటికే విషం ఇందుమతి శరీరం మొత్తం పాకడంతో.. పాల ద్వారా చిన్నారి శరీరంలోకి కూడా విషం ఎక్కింది. దీంతో తల్లీబిడ్డలు ఇద్దరూ అక్కడికక్కడే మరణించారు. అయితే కొంతకాలంగా ఇందుమతి మానసిక పరిస్థితి సరిగ్గా లేదని స్థానికులు చెబుతున్నారు. ఈ సంఘటన గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.