తిరుమల : తిరుమల(Tirumala) , తిరుపతి దేవస్థానానికి భక్తులు భారీ విరాళానాన్ని అందజేశారు. సోమవారం అన్నమయ్య భవన్లో టీఎన్ఎల్ఏసీ అధ్యక్షుడు శేఖర్రెడ్డి నేతృత్వంలో తొమ్మిది మంది భక్తులు రూ.5.11 కోట్లను టీటీడీ చైర్మన్(TTD Chairman) వైవీ సుబ్బారెడ్డికి అందజేశారు. ఈ నిధులు చెన్నైలోని టి నగర్ వెంకటనారాయణ రోడ్డులో ఉన్న శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ విస్తరణ కోసం అవసరమైన స్థలం సేకరణకు వీటిని అందజేశారు.
స్థలానికి రూ.35 కోట్లు అవసరం కాగా ఇప్పటికే భూమి కొనుగోలు కోసం భక్తులు రూ.8.15 కోట్లను టీటీడీకి అందజేశారు. సోమవారం ర్యాపిడ్కేర్ జీఆర్పీ నుంచి రూ.1.50 కోట్లు, కోయంబత్తూరుకు చెందిన వెంకట సుబ్రమణ్యం అండ్ ఫ్యామిలీ, నాగరాజన్ అండ్ ఫ్యామిలీ , సీఆర్కన్స్ట్రక్షన్స్, శరన్, శెంబగమూర్తి, నరేష్ సుబ్రహ్మణ్యం, బలహా కెమికల్స్(పి) లిమిటెడ్, నీలాద్రి ప్యాకింగ్స్ యజమానులు విరాళాన్ని అందజేశారు.ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో ఎవి ధర్మారెడ్డి, ట్రస్ట్ బోర్డు సభ్యులు, ఎమ్మెల్యే భూమా కరుణాకర్ రెడ్డి పాల్గొన్నారు.