అమరావతి : దేశం, రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఎన్డీయే కూటమి రెండు చోట్ల అధికారంలోకి రావాలని ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) పిలుపునిచ్చారు. ఏపీలోని పల్నాడు జిల్లా చిలకలూరిపేట బొప్పూడిలో టీడీపీ, జనసేన, బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజాగళం( Prajagalam) బహిరంగ సభలో మోదీ పాల్గొని ప్రసంగించారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదల తరువాత ఏర్పాటుచేసిన తొలి ప్రచార కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
ఎన్నికల ఫలితాలు జూన్ 4న విడుదల అవుతున్నాయని అంటే ఎన్డీయే (NDA)కు 4వందలకు పైగా సీట్లు వస్తాయని, కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ ఎన్డీయే అధికారంలోకి వస్తుందని ధీమాను వ్యక్తం చేశారు. ప్రాంతీయ, జాతీయ భావాలతో కలిగిన చంద్రబాబు(Chandra Babu), పవన్కల్యాణ్ (Pawan Kalyan)పార్టీల కూటమితో ఎన్డీయే మరింత బలపడిందని అన్నారు.ఆ ఇద్దరు నాయకులు ఏపీ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.
ఏపీలో వైసీపీ, కాంగ్రెస్ రెండూ ఒకటే..
ఏపీలో జగన్ (Jagan) ప్రభుత్వంలోని మంత్రులు పాలనను గాలికొదిలేసి అవినీతిలో పోటి పడుతున్నారని విమర్శించారు. గడిచిన 5 సంవత్సరాలలో రాష్ట్రం అనేక రంగాల్లో వెనుకబడిందని వెల్లడించారు. ఏపీ పునర్మిర్నాం జరగాలంటే ఎన్డీయేకు ఓటు వేసి గెలిపించాలని కోరారు.
ఏపీలో వైసీపీ, కాంగ్రెస్ పార్టీలు వేర్వేరూ కాదని ఆ రెండు పార్టీలు కలిసి ఓట్లను చీల్చేందుకు కుట్రలను పన్నాయని అన్నారు. రెండు పార్టీల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండి ఓట్లు చీలకుండా జాగ్రత్త పడాలని సూచించారు. రాబోయే 5 సంవత్సరాల్లో రాష్ట్రాన్ని శరవేగంగా అభివృద్ధి చేస్తామని, మౌలిక సదుపాయాలు కల్పిస్తామని, యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని పోర్టు డెవలప్మెంట్ చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో నీలి విప్లవం తీసుకొస్తామని మోదీ భరోసా ఇచ్చారు.