Srisailam | శ్రీశైల క్షేత్రంలో సంచరిస్తున్న ఎలుగుబంటిని అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు. గత రెండు రోజులుగా శ్రీశైలం మల్లిఖార్జున స్వామి ఆలయానికి సమీపంలో ఎలుగుబంటి సంచరించడం కలకలం సృష్టిస్తోంది. దీంతో భక్తులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో అటవీ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. శిఖరేశ్వరం సమీపంలో మూడు బోన్లను ఏర్పాటు చేశారు. శుక్రవారం తెల్లవారుజామున ఎలుగుబంటి ఓ బోనులో చిక్కింది.
ఎలుగుబంటిని పట్టుకున్న అటవీ శాఖ అధికారులు దాన్ని వెలుగోడుకు తరలించారు. అక్కడి అటవీ ప్రాంతంలో ఎలుగుబంటిని వదిలేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇక తిరుమలలోనూ చిరుత సంచారం కలవరపెడుతోంది. తిరుమల అడవుల్లో ఐదు చిరుత పులులు తిరుగుతున్నట్లు తాజాగా అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో అప్రమత్తమై తిరుమల కాలినడక దారిలోని లక్ష్మీ నరసింహస్వామి ఆలయం సమీపంలో బోనులు ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతంలో మూడు రోజుల వ్యవధిలోనే రెండు చిరుతలు చిక్కాయి.