అమరావతి: ఆంధ్రప్రదేశ్లోని సత్యసాయి జిల్లాలో ఘోరప్రమాదం జరిగింది. జిల్లాలోని తాడిమర్రి మండలం చిల్లకొండయ్యపల్లి వద్ద కూలీలతో వెళ్తున్న ఆటోపై హైటెన్షన్ వైర్లు తెగిపడ్డాయి. దీంతో ఆటో మంటల్లో కాలి బూడిదయ్యింది. ఈ ప్రమాదంలో 5 మంది సజీవదహనమయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతులను గుడ్డంపల్లికి చెందిన కూలీలుగా గుర్తించారు. వ్యవసాయ పనుల కోసం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తుచేస్తున్నారు. మృతులకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉన్నది.
ప్రమాద ఘటనపై గవర్నర్ బిశ్వ భూషణ్ హరి చందన్ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఆటోపై హైటెన్షన్ వైర్లు తెగిపడి, దానిలో ప్రయాణిస్తున్న కూలీల మృతి విచారకరమన్నారు. ప్రమాద ఘటనపై జిల్లా యంత్రాంగం నుంచి పూర్తిస్థాయి సమాచారం తీసుకోవాలని రాజ్భవన్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియాను ఆదేశించారు.