హైదరాబాద్, ఆగస్టు 16 (నమస్తే తెలంగాణ): ఇటీవల చిన్నారిపై చిరుత దాడితో భక్తుల భద్రతపై టీటీడీ అప్రమత్తమైంది. ఇప్పటికే పలు నిర్ణయాలు తీసుకోగా, చిరుతల వేటకు చర్యలు చేపట్టింది. చిరుతలను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను తిరుమలకు తెప్పించింది. నడకదారిలో 500 కెమెరాలను ఏర్పాటు చేస్తున్నది.
చిరుతల కోసం వివిధ ప్రాంతాల్లో బోన్లను ఏర్పాటు చేశారు. నడకదారి మార్గంలో 5 చిరుతలు సంచరిస్తున్నట్టు గుర్తించిన అధికారులు, వాటిని బంధించేందుకు ప్రయత్నిస్తున్నట్టు టీటీడీ విజిలెన్స్ అధికారులు వివరించారు. కాగా, మంగళవారం శ్రీవారిని 78,726 మంది భక్తులు దర్శించుకోగా, రూ.3.94 కోట్ల ఆదాయం వచ్చింది.