తిరుమల : కలియుగ ప్రత్యక్షదైవమైన శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు. కొండపై ఉన్న 14 కంపార్టుమెంట్లలో స్వామివారి దర్శనానికి భక్తులు వేచియున్నారు. టోకెన్లు లేని భక్తులకు 30 గంటల్లో సర్వదర్శనం అవుతుందని టీటీడీ అధికారులు తెలిపారు. నిన్న స్వామివారిని 70,496 మంది దర్శించుకోగా 25,500 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా రూ. 5.88 కోట్లు ఆదాయం వచ్చిందని వెల్లడించారు.
కాగా హిందూ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో తిరుపతి మహతి కళా క్షేత్రంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి భగవద్గీత కంఠస్థం పోటీల విజేతలకు రాత్రి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన దాస సాహిత్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి ఆనందతీర్థాచార్యులు మాట్లాడుతూ భగవద్గీత మానవాళికి జ్ఞానాన్ని ప్రసాదించే అద్భుతమైన గ్రంథమని అన్నారు. గీతా పఠనం ద్వారా మానసిక వికాసం కలిగి మోక్షసాధనకు మార్గం సుగమమం అవుతుందని వివరించారు.
గాంధీజీని ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరూ గీతను పఠించాలని సూచించారు. ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల నుంచి వచ్చిన విద్యార్థులకు రాష్ట్ర స్థాయి భగవద్గీత కంఠస్థం పోటీలు నిర్వహించగా విజేతలకు 50 గ్రాములు, 30 గ్రాములు, 15 గ్రాముల శ్రీవారి వెండి డాలర్లు, నగదును అందజేశారు.