తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో కొండపై ఉన్న 22 కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి. వీరికి సర్వదర్శనం 30 గంటల్లో కలుగుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు. నిన్న స్వామివారిని 60,861 మంది భక్తులు దర్శించుకోగా 28,519 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 4.53 కోట్లు ఆదాయం వచ్చిందని వివరించారు.
టీటీడీ పరిపాలన భవనంలోని మైదానంలో శుక్రవారం రాత్రి అత్యంత వైభవంగా కార్తిక మహా దీపోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. భారీ సంఖ్యలో భక్తులు హాజరై సామూహిక దీపారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్తిక మాసంలో టీటీడీ శివ కేశవ పూజల ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తోందని టీటీడీ ఈవో తెలిపారు. ఇందులోభాగంగా ఈ ఏడాది కార్తీక మాసంలో యాగంటి, విశాఖపట్నం, తిరుపతి లో కార్తిక మహా దీపోత్సవ కార్యక్రమాలు నిర్వహించామన్నారు. రాబోయే రోజుల్లో భక్తి ప్రచారాన్ని మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకుని వెళ్ళేందుకు టీటీడీ కృషి చేస్తుందని ఈవో చెప్పారు.