తిరుమల : కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని 2022 ఏడాదిలో 2.35 కోట్ల మంది భక్తులు దర్శించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ. 1,320 కోట్లు. శ్రీవారికి 1.08 కోట్ల మంది భక్తులు తలనీలాలు సమర్పించి, మొక్కులు చెల్లించుకున్నారు. ఇక ఈ ఏడాదికి గానూ 11.42 కోట్ల లడ్డూలు విక్రయం అయ్యాయి.
తిరుమలలో ఆనందనిలయం బంగారు తాపడం పనుల కోసం ఆరునెలల పాటు శ్రీవారి దర్శనం నిలుపుదల చేస్తున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకుల్లో ఒకరైన వేణుగోపాల దీక్షితులు వెల్లడించిన సంగతి తెలిసిందే. టీటీడీ ఆగమ సలహామండలి సూచనల మేరకు తిరుమల శ్రీవారి ఆనందనిలయం బంగారు తాపడం పనులు ప్రారంభించి ఆరు నెలల్లో పూర్తి చేయాలని నిర్ణయించిందన్నారు.
ఈ మేరకు బాలాలయం ఏర్పాటుకు ఆలయ అర్చకులు మార్చి ఒకటవ తేదీ ముహూర్తంగా నిర్ణయించగా ముందుగా వారం రోజులపాటు బాలాలయ నిర్మాణానికి అవసరమైన వైదిక క్రతువులు నిర్వహిస్తారని తెలిపారు. గర్భాలయంలోని మూలమూర్తి జీవకళలను కుంభంలోకి ఆవాహన చేసి బాలాలయంలో ఏర్పాటు చేసే దారు(కొయ్య) శ్రీ వేంకటేశ్వర స్వామివారి విగ్రహంలోకి ప్రవేశపెడతారని వివరించారు. ఆ తర్వాత ఆనంద నిలయానికి బంగారు తాపడం పనులు చేపడతారని తెలిపారు.
ఇందుకోసం పట్టే ఆరు నెలల సమయంలో గర్భాలయంలోని మూలమూర్తిని భక్తులు యథావిధిగా దర్శించుకోవచ్చని పేర్కొన్నారు. ఉత్సవమూర్తులైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామి వారికి నిర్వహించే కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం సేవలన్నీ యథావిధిగా జరుగుతాయని స్పష్టం చేశారు.