తిరుమల : కలియుగ ప్రత్యక్షదైవం వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు భక్తులు వివిధ ప్రాంతాల నుంచి తిరుమల (Tirumala) కు చేరుకుంటున్నారు. భక్తుల రద్దీతో 23 కంపార్ట్మెంట్లు నిండిపోగా టోకెన్లు లేని భక్తులకు 14 గంటల్లో సర్వదర్శనం (Sarvadarsan) కలుగుతుందని టీటీడీ అధికారులు వివరించారు. నిన్న స్వామివారిని 69,041 మంది భక్తులు దర్శించుకోగా 22,415 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న మొక్కుల ద్వారా హుండీకి రూ. 3.19 కోట్ల ఆదాయం వచ్చిందని వెల్లడించారు.
శ్రీ పద్మావతి అమ్మవారికి టీటీడీ మహిళా ఉద్యోగుల సారె
తిరుపతి : తిరుచానూరులో జరుగుతున్న వార్షిక కార్తిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా టీటీడీ మహిళా ఉద్యోగులతో కలిసి జేఈవో సదా భార్గవి శ్రీ పద్మావతి అమ్మవారికి పట్టువస్త్రాలు, సారె సమర్పించారు. జేఈవో మాట్లాడుతూ ప్రతి ఏడాది అమ్మవారి బ్రహ్మోత్సవాలలో టీటీడీ మహిళా ఉద్యోగులు సారె అందించడం ఆనవాయితీగా వస్తోందన్నారు.
అమ్మవారి అనుగ్రహంతో ఉద్యోగులు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఉన్నతాధికారుల సతీమణులతో పాటు, ఆలయ సూపరింటెండెంట్ వాణి, టీటీడీ మహిళా ఉద్యోగుల ప్రతినిధి హేమలత, ఇతర మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు.