నిరాశ్రయులకు అండగా నిలుస్తున్నపోలీసులు
విపత్కర సమయంలో మేమున్నామంటూ భరోసా
హన్మకొండ సిటీ, మే 21 : కరోనా విజృంభిస్తున్న సమయంలో పోలీసులు నిరాశ్రయులకు అండగా నిలుస్తున్నారు. విపత్కర పరిస్థితిలో తమను తాము రక్షించుకుంటూ ప్రజల కోసం నిర్విరామంగా పని చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 12 నుంచి లాక్డౌన్ ప్రకటించినప్పటి నుంచి పోలీసులు 24 గంటలూ గస్తీకాస్తూ ప్రజలు రోడ్లపైకి రాకుండా కట్టడిచేస్తున్నారు. ఇదే సందర్భంలో నిరాశ్రయులకు మేమున్నామంటూ భరోసా కల్పిస్తున్నారు. రోడ్లపై యాచిస్తూ జీవిస్తున్న వారు కరోనా బారిన పడకుండా ఉండేందుకు వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్జోషి మంచి మనస్సుతో వైద్యశాఖ ఆధ్వర్యంలో కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించారు. అంతేకాకుండా మాస్కులు, శానిటైజర్లు ఇచ్చి రెండు మూడు రోజులకు సరిపడా పండ్లు అందజేసి కడుపు నిండా అన్నం పెట్టించారు. పరీక్షల్లో పాజిటివ్ వస్తే ఐసొలేషన్ కేంద్రాల్లో ఉంచి వారి ఆరోగ్యం కుదుటపడే వరకూ బాగోగులు చూసే బాధ్యతను తీసుకుని నిరాశ్రయులకు పెద్ద దిక్కుగా నిలిచా రు.
హసన్పర్తి పోలీస్టేషన్ పరిధి ఆరెపల్లిలోని వంగపహాడ్ క్రాస్లో మతిస్థిమితం లేని వ్యక్తికి కానిస్టేబుల్ జయరాజ్ పండ్లు, ఆహారం అందజేసి తనలో ఉన్న మావవత్వాన్ని చా టుకున్నాడు. వరంగల్ బస్టాండ్లో నిస్సహాయ స్థితిలో ఉన్న వృద్ధులకు మిల్స్కాలనీ సీఐ రవికిరణ్ ఎస్సైతో కలిసి పండ్లు పంపిణీ చేశారు. వరంగల్ రైల్వేస్టేషన్ సమీపంలోని యాచకులతో పాటు కూలీలకు ఏఆర్ ఏసీసీ సదానందం ఆపద్బాందవ స్వచ్ఛంద సంస్థ స హకారంతో అన్నదానం ఏర్పాటు చేయించారు. అన్నారం షరీఫ్లో ఆకలితో అలమటిస్తున్న యాచకులకు పర్వతగిరి సీఐ పుల్యాల కిషన్ స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి అన్నం పెట్టించారు. వాహనాలు లేక రోడ్డుపై కాలినడకన వెళ్తున్న గర్భిణిని సుబేదారి సీఐ రాఘవేందర్ తన వాహనంలో పంపించి ఔధార్యం చాటారు. ఇలా పోలీసులు తమ పరిధిలో ఎక్కడ ఆపద ఉందని తెలిసినా, తమ కళ్లు ముందు ఇబ్బందులు పడుతున్న మనుషులు తారసపడినా బాసటగా నిలుస్తూ ప్రజలకు దగ్గరవుతున్నారు.